బిగ్ బాస్ విన్నర్ కౌశల్ తన అతి ఆవేశం కారణంగా ఏదో ఒక విషయంలో వివాదాస్పదం అవుతూనే ఉన్నాడు.తాజాగా కౌశల్ ఆర్మీకి చెందిన కొందరు తనను విమర్శించడంపై మీడియా ముందుకు వచ్చిన కౌశల్ వివాదాన్ని మరింత ముదిరేలా చేశాడు.
మీడియా ముందుకు వచ్చిన కౌశల్ ఆర్మీ గురించి, ఆర్మీ తరపున చేసిన మంచి పనుల గురించి చెప్పకుండా కొన్ని లేని పోని అబాండాలు వేయడంతో ఆయనపై ఇప్పుడు కేసు నమోదు అయ్యే వరకు వెళ్లింది.పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం కనిపిస్తోంది.
కౌశల్ ఆర్మీలో విభేదాలకు ప్రధాన కారణం తనీష్ మరియు బాబు గోగినేని అంటూ కౌశల్ ఆరోపించాడు.అరెస్ట్ వారెంట్లకు భయపడి, ఇక్కడ కేసులు ఉన్న కారణంగా విదేశాల్లో విజయ్ మాల్యాలాగా తల దాచుకున్నాడు అంటూ కౌశల్ తీవ్ర స్థాయిలో బాబు గోగినేనిపై ఆరోపణలు చేయడం జరిగింది.ఈ విషయంలో బాబు గోగినేని స్పందిస్తూ నాపై ఎలాంటి కేసులు లేవు, నన్ను ఇప్పటి వరకు ఎవరు కూడా ఎంక్వౌరీకి రమ్మని పిలవలేదు.అసలు నన్ను పోలీసులు కనీసం సంప్రదించను కూడా లేదు.
ఏదో చిన్న కేసును పట్టుకుని విజయ్ మాల్యాలా నన్ను పోల్చడం ఏంటీ అంటూ బాబు గోగినేని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తనపై లేని పోని ఆరోపణలు చేసి, విమర్శించిన కారణంగా కౌశల్పై కేసు నమోదు చేస్తున్నట్లుగా ప్రకటించాడు.బాబు గోగినేని ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు.ఆయన తరపు న్యాయవాది ఇక్కడ కేసు నమోదు చేయబోతున్నాడు.
ఇక తనీష్పై కూడా కౌశల్ ఆరోపణలు చేశాడు.తనీష్ వల్లే తన సినిమా చేజారిపోయింది, తన వల్లే కౌశల్ ఆర్మీ దెబ్బ తిన్నది అంటూ కౌశల్ ఆరోపించాడు.
ఆ వ్యాఖ్యలపై తనీష్ సీరియస్ గా స్పందించాడు.తాను ఎప్పుడు కూడా కౌశల్కు సంబంధించి మాట్లాడలేదు.
అయినా కూడా ఆయనే ఎందుకు తనను టార్గెట్ చేస్తున్నాడో అర్థం కావడం లేదని, తనపై లేని పోని ఆరోపణలు చేసినందుకు తాను కూడా కేసు నమోదు చేయబోతున్నట్లుగా తనీష్ ప్రకటించాడు.
ఇక టీవీ5 మూర్తి కూడా కౌశల్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.నాకు పెళ్లే కాలేదు, అలాంటి నేను నా పిల్లలు మీ అభిమాని అంటూ చెప్పి ఆయన్ను చర్చకు పిలిచాను అంటూ చెప్పడం అవివేకం అని, కౌశల్ మరో కేఏపాల్ అవుతున్నాడు అంటూ మూర్తి అన్నాడు.మొత్తానికి కౌశల్ నోరు జారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన కెరీర్ను, ఆయన పరిస్థితిని మరింతగా దిగజార్చాయి.