బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 తొలి వారం నుంచి వివాదాలతో పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే.ప్రేక్షకుల ఓట్లను పరిగణనలోకి తీసుకోకుండా బిగ్ బాస్ హౌస్ లోని స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తున్నాడని బిగ్ బాస్ ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
బిగ్ బాస్ హౌస్ నుంచి ఆదివారం రోజున ఎలిమినేట్ అయిన అవినాష్ సైతం పరోక్షంగా బిగ్ బాస్ తనను అన్యాయంగా ఎలిమినేట్ చేశాడని కామెంట్లు చేశారు. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చినా అవినాష్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ వల్లే ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం ఈ షోపై ఆసక్తి చూపారు.
అయితే ఎలిమినేషన్ లోకి వచ్చిన ప్రతిసారి సింపథీ గేమ్ ఆడేందుకు ప్రయత్నించడం, తన కష్టాల గురించి పదేపదే చెప్పుకోవడం, కొందరు కంటెస్టెంట్లు అవినాష్ పై చేసిన కామెంట్లు అతనికి మైనస్ గా మారాయి.ఎలిమినేట్ అయిన అవినాష్ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ తాను బిగ్ బాస్ షోలో పాల్గొని ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించానని చెప్పారు.
బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులకు సైతం తాను పూర్తిస్థాయిలో న్యాయం చేశానని అయినప్పటికీ ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యానని చెప్పారు.బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ వీక్ కంటెస్టెంట్ అని హౌస్ లో ఇతర కంటెస్టెంట్లు సైతం మోనాల్ ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారని.కానీ తాను ఎలిమినేట్ అయ్యానని అవినాష్ చెప్పుకొచ్చారు.పరోక్షంగా బిగ్ బాస్ తనను ఎలిమినేషన్ విషయంలో మోసం చేసినట్టు అవినాష్ చెప్పకనే చెప్పారు.
గతంలో దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్, లాస్య, కుమార్ సాయి సైతం తమను అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ ఆరోపణలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున బిగ్ బాస్ ఓట్ల విషయంలో ఇప్పటికే చాలాసార్లు వివరణ ఇచ్చుకున్నా ప్రేక్షకులు మాత్రం ఎలిమినేషన్ల విషయంలో కొందరు కంటెస్టెంట్లకు అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడుతూ ఉండటం గమనార్హం.