ఎలన్ మస్క్ సారథ్యంలోని టెస్లాకు ఈసారి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది భారత ప్రభుత్వం .విద్యుత్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించే ఆలోచన తమకు లేదని తేల్చి చెప్పింది.
భారత్ లో టెస్లా ఫ్యాక్టరీని పెట్టేందుకు సిద్ధమైన సంస్థ సీఈవో ఎలాన్ మస్క్.విద్యుత్ వాహనాలపై పన్నులను తగ్గించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
అయితే, దీనిపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జర్ మంగళవారం స్పష్టతనిచ్చారు.దిగుమతి సుంకాలను తగ్గించే ఉద్దేశం లేదని పార్లమెంట్లో ప్రకటించారు.
అయితే, స్థానికంగా ఉన్న విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు దేశంలో విధిస్తున్న పన్నులను తగ్గిస్తామని, చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.ఇదే సమయంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే వాటిపై పన్నుల్లో ఎలాంటి తగ్గింపూ ఉండదని క్రిషన్ పాల్ తెలిపారు.
టెస్లాను భారత్లో విడుదల చేయడానికి అక్కడి దిగుమతి సుంకాలు ప్రతిబంధకంగా వున్నాయంటూ స్వయంగా కొద్దిరోజుల క్రితం ఎలన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.భారత్లో టెస్లా లాంచింగ్కు సంబంధించి ఇటీవల ట్విటర్లో ఎలాన్ మస్క్ను ఓ నెటిజన్ ప్రశ్నించాడు.
భారత్లో వీలైనంత త్వరగా టెస్లా కార్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాడు.దీనికి మస్క్ స్పందిస్తూ.
జాప్యానికి గల కారణాన్ని వెల్లడించారు.ఇండియాలో దిగుమతి సుంకాలు అధికంగా ఉన్నాయని.
స్వచ్ఛ ఇంధన వాహనాలను సైతం పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల వాహనాల వలే పరిగణిస్తున్నారంటూ ఎలన్ మస్క్ అసహనం వ్యక్తం చేశారు.అయితే, త్వరలో విద్యుత్తు వాహనాలపై కనీసం తాత్కాలిక ఉపశమనమైనా కల్పిస్తారని ఆశిస్తున్నాం అని మస్క్ సదరు నెటిజన్కి రిప్లై ఇచ్చాడు.
ఈ ఏడాది భారత్లో అమ్మకాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న టెస్లా.అన్ని మంత్రిత్వ శాఖలకు, నీతి ఆయోగ్కు లేఖలు రాసింది.పూర్తి అసెంబ్లీంగ్ జరిగిన కార్లపై 40 శాతం మేర పన్నులు తగ్గించాలని కోరింది.40 శాతం దిగుమతి సుంకం తగ్గించడం వల్ల ఎలక్ట్రిక్ కార్లు మరింత సరసమైన ధరకు రాగలవని మస్క్ అభిప్రాయపడుతున్నారు.కానీ ఈ లేఖలపై నీతి ఆయోగ్ కానీ, రవాణా, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలు స్పందించలేదు.ఇలాంటి పరిస్దితుల్లో కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడం ఎలన్ మస్క్కి ఊహించని షాకేనని కార్పోరేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
టెస్లా యూఎస్ వెబ్సైట్ ప్రకారం.మోడల్ 3 స్టాండర్డ్ రేంజ్ ప్లస్ ధర 40,000 డాలర్ల కంటే తక్కువే వుంది.
ప్రస్తుతం భారత్లో ప్రీమియం ఈవీల మార్కెట్ ఇంకా ఆరంభ దశలోనే వుంది.ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు తక్కువ మంది వద్దే వుండటంతో పాటు దేశంలో కార్లను ఛార్జింగ్ చేసుకునే సదుపాయాలు చాలా పరిమితంగా వున్నాయి.
బెంగళూరులో తన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు టెస్లా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.అన్నీ అనుకున్నట్లే జరిగితే అమెరికా తర్వాత టెస్లా పరిశోధనా కేంద్రం ఉన్న రెండో దేశం ఇండియానే అవుతుంది.మరోవైపు భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది.2025 నాటికి ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా రూ.50 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.మొత్తం రూ.50 వేల కోట్ల లక్ష్యంలో రూ.15 వేల కోట్లు.వాహనాల విడి భాగాలైన బ్యాటరీ, కంట్రోలర్, మోటార్ల నుంచి రానుంది.వీటికి తోడు రాబోయే రోజుల్లో భారత్లో 30 లక్షల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతాయని మార్కెట్ వర్గాల అంచనా.