ఈ భూమ్మీద కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశం ఏదైనా వుందంటే అది అమెరికాయే.వైరస్ దేశంలోకి ప్రవేశించిన కొత్తల్లో ట్రంప్ యంత్రాంగం ఉదాసీన వైఖరితో అమెరికన్లు భారీ మూల్యం చెల్లించుకున్నారు.
లక్షల సంఖ్యలో మరణాలు, అంతకు రెట్టింపు సంఖ్యలో బాధితులు, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలడం, లక్షలాది మంది ఉపాధి కోల్పోవడం ఇలాంటి వైపరీత్యాలను అమెరికా ఎదుర్కోవాల్సి వచ్చింది.ఏడాది గడుస్తున్నా అగ్రరాజ్యంలో వైరస్ ఇంకా శాంతించకపోగా.
కేసులు భారీగానే నమోదవుతున్నాయి.కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్.
కోవిడ్పై యుద్ధాన్ని ప్రకటించారు.ప్రజలకు టీకా పంపిణీ, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు గాను భారీ ఉద్దీపన ప్యాకేజీ వంటి చర్యలు చేపట్టారు.
తాజాగా బైడెన్ మరో నిర్ణయం తీసుకున్నారు.
దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.2.5 కోట్లకు పైగా మాస్కులను పంపిణీ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది.కొవిడ్పై పోరులో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఫుడ్ ప్యాంట్రీలు, సూప్ కిచెన్లలో వీటిని పంపిణీ చేయనున్నట్లు వైట్హౌస్ ప్రకటించింది.వైరస్ వ్యాప్తిని నిలువరించడంలో మాస్కులు కీలకమని ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటికీ పేద అమెరికన్లు మాస్కులు కొనుగోలు చేయలేకపోతున్నారని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ భారీ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.
మార్చి నుంచి మే మధ్య కాలంలో దేశంలోని 1300 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 60,000 ఫుడ్ ప్యాంట్రీలు, సూప్ కిచెన్లలో మాస్కుల పంపిణీ చేస్తామని వైట్హౌస్ తెలిపింది.
కాగా, దేశంలో కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని గతంలో ట్రంప్ ప్రభుత్వం మాస్క్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడదామనుకుని వెనుకడుగు వేసిన సంగతి తెలిసిందే.ఇక మొదటి నుంచి డొనాల్డ్ ట్రంప్ మాస్కుల ప్రాముఖ్యాన్ని చాలా తక్కువ చేసి చూశారు.
అప్పటికి అమెరికాలో 2,15,000 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినా, చివరికి స్వయంగా వైరస్ బారినపడినా ఆయన మాస్క్ల వాడకంపై దృష్టి పెట్టలేదు.వైరస్ వ్యాప్తి నిరోధానికి మాస్క్లు తప్పనిసరి చేయాలని నిపుణులు హెచ్చరిస్తే.
ట్రంప్ వారిపై కారాలు మిరియాలు నూరిన సంగతి తెలిసిందే.ఇక బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వంద రోజులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు.
అలాగే ప్రజారవాణా, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ మాస్కులు ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.