అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వలస విధానంపై తన మార్క్ కనిపించేలా వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు బైడెన్.ట్రంప్ హయాం నాటి ఇమ్మిగ్రేషన్ పాలసీలను ఒక్కొక్కటిగా ఎత్తేస్తూ వస్తున్నారాయన.
ఇప్పటికే హెచ్ 1 బీ వీసాల్లో లాటరీ విధానం, హెచ్ 4 బీ వీసాదారులకు వర్క్ పర్మిట్ల విషయంలో ఆయన వలసదారులకు ఊరట కలిగించారు.తాజాగా అమెరికాలో ఆశ్రయం కోసం సరిహద్దులోని మెక్సికోలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న శరణార్థులపై బైడెన్ కరుణ చూపారు.
వీరిని దేశంలోకి అనుమతించే ప్రక్రియకు ఆయన ఆమోదముద్ర వేయడంతో నిన్నటి నుంచి శరణార్ధులు అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు.
అయితే కొన్ని కారణాల వల్ల తొలి దశలో పరిమిత సంఖ్యలోనే శరణార్థులను అనుమతించనున్నారు.
అలాగే దేశంలోకి ప్రవేశించే వారి సంఖ్యను సాధ్యమైనంత తగ్గించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.తమ దేశంలోకి ప్రవేశించకుండా మెక్సికోలోనే ఉండాలంటూ శరణార్థులకు సూచిస్తున్నారు.అయినప్పటికీ అమెరికాలోకి రావాలనుకునేవారు వచ్చేవారం శరణార్థుల కోసం ఐక్యరాజ్య సమితి ప్రారంభించబోయే వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.ప్రస్తుతం అగ్రరాజ్యంలో కోవిడ్ ఉద్ధృతి ఎక్కువగా వున్న నేపథ్యంలో శరణార్థులను దేశంలో అనుమతించే విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.
పరీక్షలు నిర్వహించి పాజిటివ్గా తేలితే 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచనున్నారు.ఆ తర్వాతే అమెరికాలోకి అడుగుపెట్టనిస్తున్నారు.
కాగా, అమెరికాలోకి అక్రమ వలసలు రాకుండా సరిహద్దు గోడ నిర్మిస్తానని హామీ ఇచ్చిన ట్రంప్.అధికారంలోకి రాగానే మెక్సికో సరిహద్దు వెంబడి కోట్ల డాలర్ల నిధులు వెచ్చించి గోడ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు.
అయితే తొలి నాటి నుంచే ఈ నిర్ణయంపై అభ్యంతరం తెలిపారు డెమొక్రాట్లు.ఈ నేపథ్యంలోనే నూతన అధ్యక్షుడు జో బైడెన్ గోడ నిర్మాణానికి వెచ్చించిన నిధులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అమెరికా ట్రెజరీ నుంచీ దాదాపు 60 కోట్ల డాలర్లు, అలాగే అమెరికా రక్షణ రంగం నిధుల నుంచీ 610 కోట్ల డాలర్లు కేవలం ఈ గోడ నిర్మాణం కోసం ట్రంప్ వెచ్చించారని, ఈ నిధులను తక్షణమే నిలిపివేస్తున్నట్టుగా ఆయన ఈ వారం ప్రారంభంలో ఆదేశాలిచ్చారు.