డొనాల్డ్ ట్రంప్ హయాంలో అస్తవ్యస్తమైన అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను దారిలో పెట్టేందుకు జో బైడెన్ మరమ్మత్తు చర్యలు చేపట్టారు.ఇప్పటికే మెక్సికో గోడను బద్ధలు కొట్టిన ఆయన అక్రమ వలసదారులకు అమెరికాలోకి తలుపులు తెరిచారు.
ఇక హెచ్ 1 బీ వీసాలు, గ్రీన్కార్డుల జారీపై వున్న నిషేధాన్ని ఎత్తివేశారు.దీంతో పాటు లాటరీ విధానంలోనే హెచ్ 1 బీ వీసాలు మంజూరు చేస్తామని బైడెన్ వెల్లడించారు.అలాగే గ్రీన్కార్డుల జారీపై దేశాల కోటా పరిమితి (కంట్రీ క్యాప్)ని ఎత్తేయడంతో పాటుగా దేశంలో చట్టవిరుద్ధంగా తలదాచుకుంటున్న 1.1కోట్ల మంది అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించాలని భావించింది.దీనికి వీలు కల్పించే అమెరికా పౌరసత్వ బిల్లు 2021ని కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా హెచ్1బీ, ఇతర వీసాదారుల కనీస వేతన పరిమితిని భారీగా పెంచుతూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అమలును మరో 18 నెలలు వాయిదా వేయాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో కార్మిక శాఖకు ఈ నిబంధనల చట్టబద్ధత, విధానపరమైన సమస్యలను సమగ్రంగా విశ్లేషించి పరిష్కరించేందుకు తగిన సమయం లభిస్తుందని అధ్యక్షుడు భావిస్తున్నారు.ఈ నెల మొదటి వారంలో బైడెన్ ప్రభుత్వం ఈ నిబంధనల అమలును తొలుత 60 రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తాజా ఉత్తర్వులతో ఈ నిబంధనల అమలు గడువు 2022 నవంబర్ 14 వరకు పెంచినట్లయ్యింది.
కాగా.గతంలో హెచ్1బీ వీసాదారుల వార్షిక వేతన పరిమితి 65 వేల డాలర్లుగా ఉండేది.అయితే వలసలకు చెక్ పెట్టి.అమెరికా పౌరులకు భారీగా ఉపాధి అవకాశాలు లభించేలా చేసేందుకు గాను డొనాల్డ్ ట్రంప్ ఈ వేతన పరిమితిని 1.10 లక్షల డాలర్లకు పెంచాలని ఆయన ప్రతిపాదించారు.తాను అధ్యక్షుడిగా దిగిపోవడానికి కొద్దిరోజుల ముందు ఈ కనీస వేతన నిబంధనలను ట్రంప్ తీసుకువచ్చారు.హెచ్-1బీ, ఈ 3 నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల ద్వారా శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునే కంపెనీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ట్రంప్ తెలిపారు.ఆయన నిర్ణయంపై అప్పట్లో ప్రతిపక్షాలు, టెక్ సంస్థలు సహా అనేక వలస వాద సంఘాలు తమ నిరసన తెలియజేశాయి.తాజాగా బైడెన్ ఈ నిబంధనల అమలను తాత్కాలికంగా వాయిదా వేయడం స్వాగతించదగ్గ పరిణామం.