ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతాలు ఏమిటి అని ఎవరైనా అడిగితే ఠక్కున ఏ బస్ స్టేషన్ లేక రైల్వే స్టేషన్ పేరు చెబుతాం.ఇక పండగల సమయంలో ఈ రెండు ప్రయాణ ప్రాంగణాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి.
వీటిలో కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖపై ఎంతటి ఆదాయం గడిస్తుందో అందరికీ తెలిసిందే.కానీ ఒడిషా రాష్ట్రంలోని ఓ రైల్వే స్టేషన్లో ఎంత ఆదాయం వస్తుందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.
ఒడిషాలోని బొలంగిర్ జిల్లాలో బిచ్చుపాలి రైల్వే స్టేషన్కు రోజు వచ్చే ప్రయాణికుల సంఖ్య కేవలం ఇద్దరు మాత్రమే.అవును మీరు చదివింది నిజమే.
ఈ రైల్వే స్టేషన్కు వచ్చే వారి సంఖ్య కేవలం రెండు.వారి ద్వారా ఈ స్టేషన్కు వచ్చే ఆదాయం రోజుకు రూ.20 మాత్రమే.ఇక్కడ మరో విచిత్రమేమిటంటే ఈ రైల్వేలైనును ఏకంగా రూ.115 కోట్లతో నిర్మించగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఇంతటి ఖర్చు పెట్టి నిర్మించిన ఈ రైల్వే స్టేషన్కు రోజూ రూ.20 మాత్రమే రావడంతో ఈ స్టేషన్ వార్తల్లో నిలిచింది.దీనిపై రైల్వే అధికారులు స్పందించారు.ఈ స్టేషన్కు వచ్చే ఆదాయం రూ.20 అనేది నిజం అని వారు అన్నారు.కాగా సోనేపూర్ రైల్వేలైన్కు దీన్ని కనెక్ట్ చేస్తే ఆదాయం పెరుగుతుందని వారు ఆశిస్తున్నారు.మరి ఈ రైల్వే స్టేషన్కు రద్దీ పెరుగుతుందా లేదా అనేది మాత్రం చాలా ఆసక్తికర అంశంగా మారింది.