టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ అరెస్టు వ్యవహారం ఏపీ తెలంగాణ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ వ్యవహారం లో భూమా అఖిలప్రియ, ఆమె భర్త తో పాటు మరి కొంత మంది ఉండడం వంటి వ్యవహారాలతో ఏపీ తెలంగాణలో దీనిపై రాజకీయ ఆసక్తి పెరిగిపోయింది.
అయితే ఈ వ్యవహారంపై భూమా అఖిలప్రియ తరఫున ఆమె సోదరి, సోదరుడు మాత్రమే స్పందిస్తూ, మీడియాలో ఈ వ్యవహారం పై మాట్లాడుతున్నారే తప్ప, పార్టీ తరఫున టిడిపి నాయకులు ఎవరు అఖిలప్రియ అరెస్ట్ వ్యవహారంపై స్పందించకపోవడం, కనీసం సానుభూతి వ్యక్తం చేస్తూ ప్రకటన చేయకపోవడం వంటి వ్యవహారాలపై భూమా వర్గీయులుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపికి చెందిన ఎంతో మంది కీలక నాయకులు అరెస్ట్ అవ్వడమే కాకుండా జైలుపాలయ్యారు.
ఆ సందర్భంగా చంద్రబాబు లోకేష్ వంటి వారు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
జగన్ ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు పెడుతూ చేయాల్సిన హడావుడి చేసేవారు.
ఇక వ్యక్తిగత వ్యవహారాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు అయినా, దాన్ని కూడా ప్రభుత్వ వేధింపుల కింద చూపిస్తూ హంగామా చేశారు.స్వయంగా లోకేష్ వంటివారు సదరు నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ పరామర్శించారు.
మాజీమంత్రి కొల్లు రవీంద్ర హత్య కేసులో అరెస్టు కాగా ,స్వయంగా చంద్రబాబు సైతం ఆయనను పరామర్శించి నానా హంగామా సృష్టించారు.కానీ భూమా అఖిలప్రియ వ్యవహారంలో కనీసం చంద్రబాబు స్పందించకపోవడం, దీనిపై ఏ విధమైన చర్చ టిడిపిలో లేకపోవడంపై సర్వత్ర చర్చనీయాంశమవుతోంది.
భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యింది కేసీఆర్ బంధువుల వ్యవహారంలో కాబట్టి తెలంగాణ టిడిపి నాయకులు స్పందించి టిఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ, అఖిలప్రియ కు అండగా నిలిచే అవకాశం ఉంది.
కానీ ఏపీ, తెలంగాణలో టిడిపి నాయకులు ఎవరూ కనీసం అఖిలప్రియ వ్యవహారంపై స్పందించకుండా మౌనంగా ఉండడంపై భూమా వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి భూమా అఖిలప్రియ వైసీపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, టిడిపిని జనాల్లోకి తీసుకువెళుతూ, గత కొంతకాలంగా హడావుడి చేస్తున్నారు.అటువంటిది అఖిలప్రియ వ్యవహారంపై అటు లోకేష్ కానీ, చంద్రబాబు గాని నోరు మెదపకపోవడం ఏంటని ? మిగతా నాయకులకు ఒక న్యాయం అఖిల ప్రియ కు మరో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు.