కరోనా మహమ్మారి వల్ల ఇతర దేశాలతో పోలిస్తే భారత్ కు చెందిన ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు.ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ మహమ్మారిని కట్టడి చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదు.
దేశంలో మొదట్లో వందల సంఖ్యలో కరోన కేసులు నమోదు కాగా ప్రస్తుతం 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.మరికొన్ని రోజుల్లో దేశంలో లక్షకు పైగా కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.మరోవైపు ఆక్స్ ఫర్డ్ లాంటి ప్రముఖ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో విఫలం కావడంతో కరోనా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే ఇలాంటి తరుణంలో భారత్ బయోటెక్ సంస్థ శుభవార్త చెప్పింది.
తమ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఆశాజనకమైన ఫలితాలను ఇచ్చినట్టు వెల్లడించింది.
భారత్ బయోటెక్ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాలను వెల్లడించింది.
వ్యాక్సిన్ తీసుకున్న జంతువులలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే ఇమ్యూనిటీ పవర్ పెరిగినట్లు తాము గుర్తించామని పేర్కొంది.వ్యాక్సిన్ వల్ల జంతువుల్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగలేదని… ఊపిరితిత్తులు, గొంతు, ముక్కు లాంటి అవయవాలలో వైరస్ వృద్ధి నియంత్రణ జరిగినట్టు తేలిందని తెలిపింది.
తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసిన భారత్ బయోటెక్ కొన్ని రోజుల క్రితం రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది.మన దేశంలో తయారైన వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో సత్ఫలితాలను ఇస్తే దేశ ప్రజలకు వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తిస్థాయిలో విజయవంతమైతే కోవాగ్జిన్ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.