తాడిని తన్నేవాడుంటే వాడి తలతన్నేవాడు ఇంకొకడు ఉంటాడన్న చందంగా మారింది నేడు దొంగల పరిస్థితి.వారు చేసే దొంగతనాలను, దోపిడీలను ప్రజలు గ్రహించి అర్థం చేసుకునేలోపే ఇంకో కొత్త పద్ధతిలో దొంగతనం చేస్తూ హడలెత్తిస్తున్నారు.
ప్రధానంగా ఏటీఎం దొంగలైతే రోజుకో కొత్త విధానంలో దొంగతనం చేస్తూ ప్రజల్ని ఇంకా భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు.అయితే ఇప్పుడు వారు తమ రూటు మార్చారు.
బెదిరించడం, భయ పెట్టడం అంతా పాత పద్ధతి అనుకున్నారో ఏమో, ఇప్పుడు ఓ లేటెస్ట్ పద్ధతిలో రాజాల్లా దొంగతనం చేస్తున్నారు.ఆ పద్ధతి ఏమిటో మనమూ తెలుసుకుందాం.
ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేసినప్పుడు డబ్బులు ఓ చిన్నపాటి బాక్స్ ద్వారా బయటికి వస్తాయి కదా! ఆ, అవును.ఆ బాక్స్ను పోలిన ఓ డమ్మీ బాక్స్ను దానిపై ఉంచి గమ్తో అంటిస్తారు.అప్పుడది బయటికి చూసే వారికి నిజమైన క్యాష్ బాక్స్లాగే అనిపిస్తుంది.
అది కూడా ఏటీఎంలో ఓ భాగంగా కనిపిస్తుంది తప్ప దానిపై ఎవరికీ అనుమానం రాదు.అంతేకాకుండా ఏటీఎం లావాదేవీ నిర్వహించిన తరువాత బయటికి వచ్చే స్లిప్ బాక్స్పై ఓ సెలోటేప్ను అంటిస్తారు.
దీంతో ట్రాన్సాక్షన్ పూర్తయిన తరువాత స్లిప్ బయటికి రాదు.ఈ క్రమంలో ఎవరైనా వినియోగదారుడు ఆ ఏటీఎంలోకి వచ్చి డబ్బులు డ్రా చేస్తే డమ్మీ బాక్స్ అడ్డుగా ఉంటుంది కాబట్టి క్యాష్ బయటికి రాదు.
కానీ అప్పటికే క్యాష్ ఒరిజినల్ బాక్స్ నుంచి బయటికి వచ్చి ఉంటుంది.దీంతోపాటు సెలోటేప్ అంటించి ఉండడం వల్ల స్లిప్ కూడా బయటికి రాదు.
దీంతో వినియోగదారుడు ఆ ఏటీఎంలో ఏదైనా సాంకేతిక సమస్య ఉందేమోనని అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోతాడు.అనంతరం దొంగ వచ్చి డమ్మీ బాక్స్ తీసేసి ఒరిజినల్ బాక్స్ నుంచి బయటికి వచ్చి ఉన్న డబ్బులను తీసుకుని ఎంచక్కా వెళ్లిపోతాడు.
తెలుసుకున్నారుగా! ఏటీఎంలలో కొత్త పద్ధతిలో దొంగలు ఎలా డబ్బులు దోచుకుంటున్నారో! ఈ విషయాన్ని మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయండి.వారు కూడా జాగ్రత్త పడతారు.
అయితే ఈ పద్ధతిని వివరిస్తూ మనకు ఒక వీడియో కూడా అందుబాటులో ఉంది.దాన్ని ఇప్పుడు మీరు చూడవచ్చు.