ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేసి తినాలని చూసిన ఓ వ్యక్తికి దిమ్మతిరిగే ఘటన ఎదురైంది.అతడి బ్యాంక్ ఖాతా నుండి ఏకంగా రూ.90 వేల నగదు మాయమవ్వడంతో అతడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.కోరమంగళకు చెందిన ఎన్వీ షేక్ డిసెంబరు 1న మధ్యాహ్నం 1:30 సమయంలో ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో ఓ పిజ్జాను ఆర్డర్ చేశాడు.
పిజ్జా ఆర్డర్ చేసిన చాలా సమయానికి కూడా అది రాకపోవడంతో కస్టమర్ కేర్ నెంబర్కు ఫోన్ చేశాడు.అయితే కస్టమర్ కేర్ నుండి మాట్లాడిన వ్యక్తి, ప్రస్తుతం ఆ రెస్టారెంట్ ఆర్డర్లు తీసుకోవడం లేదని కట్ అయిన డబ్బులు మళ్లీ బ్యాంక్ ఖాతాలోకి వస్తాయని చెప్పాడు.
దీనికోసం తనకు ఓ లింక్ వస్తుందని, దానిపై క్లిక్ చేయాలని చెప్పాడట.ఫోన్ పెట్టేసిన వెంటనే షేక్ మొబైల్ ఫోన్కు ఓ లింక్ వచ్చింది.
దానిపై క్లిక్ చేసిన వెంటనే షేక్ అకౌంట్ నుండి రూ.45 వేలు మాయమయ్యాయి.దీంతో వెంటనే తన ఖాతాలో ఉన్న మిగతా రూ.50 వేల డబ్బును వేరే అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలని ఆలోచించిన షేక్ అది చేసే లోపే అవి కూడా మాయమయ్యాయి.దీంతో అతడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.కాగా తమ సంస్థకు కస్టమర్ కేర్ అనేదే లేదని జొమాటో ప్రతినిధి తెలిపారు.సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.