విజయనగరం జిల్లా రాజకీయాల్లో బెల్లాన చంద్రశేఖర్ ఒకరు.ఆయన ప్రస్తుతం విజయ నగరం ఎంపీగా ఉన్నారు.
ఆయన 2019 ఎన్నికల్లో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును దాదాపు 50 వేల ఓట్ల తేడాతో ఓడించి సత్తా చాటారు.ఆయన ప్రస్తుతం మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు దగ్గరి బంధువు అవుతారు.
బొత్స సత్యనారాయణే బెల్లాన చంద్రశేఖర్ కు రాజకీయ గురువు అనే చెప్పాలి.ఇలా బొత్స ఉండడం వలన బెల్లాన చంద్రశేఖర్ కు ఎంపీ టికెట్ చాలా సులభంగా వచ్చిందనే టాక్ కూడా ఉంది.
కానీ బెల్లాన చంద్రశేఖర్ ప్రస్తుతం బొత్స సత్యనారాయణకు పోటీగా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారనే టాక్ నడుస్తోంది.ఇలా 2024 లో చీపురు పల్లి ఎన్నికల్లో ఎవరికి సీటు వస్తుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
2007 లో బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ విజయనగరం జెడ్పీ చైర్మన్ గా ఉండేవారు.కానీ బొబ్బిలి పార్లమెంట్ కి ఉప ఎన్నిక వస్తే జెడ్పీ చైర్మన్ గా ఉన్న ఝాన్సీ రాణి అక్కడ పోటీ చేసేందుకు తన జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు.
ఇక అప్పుడు వైస్ చైర్మన్ గా ఉన్న చంద్రశేఖర్ కు చైర్మన్ గా అవకాశం వచ్చింది.దాంతో ఆయన మొదటి సారి 2007లో జెడ్పీ చైర్మన్ అయ్యారు.కానీ 2009లో వైఎస్సార్ చనిపోవడంతో ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి వైసీపీని స్థాపించడంతో చంద్రశేఖర్ వైసీపీలో చేరిపోయారు.2014 ఎన్నికల్లో చీపురు పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.కానీ అక్కడ ఆయన టీడీపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు.2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బొత్స కంటే కూడా చంద్రశేఖర్ కి తక్కువగానే ఓట్లు రావడం గమనార్హం.అలా రోజులు గడిచిపోయాయి.కాంగ్రెస్ లో ఉన్న బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరిపోయారు.ఇక 2019 ఎన్నికల్లో ఆయన చీపురు పల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.ఆ సందర్భంలో విజయ నగరం ఎంపీగా పోటీ చేసి చంద్రశేఖర్ విజయం సాధించారు.
మరలా ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఆయన చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.కానీ అక్కడ మంత్రి బొత్స ఉండడంతో వైసీపీ చంద్రశేఖర్ కు సీటు కేటాయిస్తుందో లేదో వేచి చూడాలి.