డబ్బు సంపాదించడం కోసం చాలామంది అనేక తప్పుడు మార్గాలను ఎన్నుకుంటారు.ఉన్నది చాలక ఇంకా సంపాదించాలని ఏమి చేయడానికి అయినా వెనుకాడరు.అయితే ఒకే వ్యక్తి ఆస్తులు, అంతస్తులు ఏమి లేవు కేవలం ఆలయాల ముందు భిక్షం ఎత్తుకుని జీవనం సాగించే ఓ యాచకుడు సుమారు రూ.8 లక్షలకు పైగా ఆయా దేవాలయాలకు విరాళాలు ఇచ్చాడు.
అవును మీరు విన్నది నిజమే.వివరాలలోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన యడ్ల యాదిరెడ్డి పదేళ్ల వయస్సులోనే విజయవాడకు బతుకుతెరువు కోసం వచ్చాడు.
విజయవాడలో నివాసం ఉంటూ నలభై ఏళ్ల పాటు విజయవాడ రైల్వే స్టేషన్ కేంద్రంగా రిక్షా తొక్కిజీవనం కొనసాగించాడు.తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో యాదిరెడ్డి 20 ఏళ్ల నుండి రిక్షా తొక్కడం మానేశాడు.
అప్పటి నుండి దేవాలయాల ముందు భిక్షాటన చేయడం మొదలు పెట్టాడు.తొలుత విజయవాడలోని ముత్యాలంపాడు కోదండరామ ఆలయం వద్ద భిక్షాటనను మొదలు పెట్టాడు.
ఆ తర్వాత షిర్డీ సాయిబాబా ఆలయం వద్దకు మారాడు.
భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులను ఆయన బ్యాంకులో దాచుకొనేవాడు.
కొంతకాలం తర్వాత అనారోగ్యం పాలయ్యాడు.తాను బతికితే లక్ష రూపాయాలను సాయిబాబా ఆలయానికి ఇస్తానని ఆయన మొక్కుకొన్నాడు.
ఆయన అనారోగ్యం నుండి కోలుకొన్నారు.మొక్కుకున్నట్లు గానే సాయిబాబా ఆలయానికి రూ.లక్ష విరాళంగా ఇచ్చారు.అంతటితో ఆగలేదు ఈ ఆలయంలో దత్తాత్రేయ విగ్రహంతో పాటు ఆ విగ్రహానికి తొడుగులకు రూ.20 వేలు, షిరిడీ ఆలయంలో అన్నదానానికి రూ.20 వేలు ఇచ్చాడు.గురు పౌర్ణమి సమయంలో షిరిడీ ఆలయంలో నిర్వహించే అభిషేకం సమయంలో రూ.1.08 లక్షలు చెల్లించాడు.ఈ ఆలయానికి సమీపంలోనే ఉన్న గోశాల నిర్మాణానికి రూ.3 లక్షలు విరాళమిచ్చాడు.కోదండ ఆలయంలో సీతారాములు, లక్ష్మణుడు హనుమంతులకు వెండి కిరిటాలు చేయించాడు.దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి రూ.1.11 లక్షలు విరాళంగా ఇచ్చాడు.దగ్గర దగ్గర సుమారు రూ.8 లక్షలకు పైగా పలు దేవాలయాలకు విరాళంగా ఇచ్చాడు.భక్తుల వద్ద తీసుకున్న సొమ్ముని దేవుడికే విరాళంగా ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నాడు మన యాదిరెడ్డి… !!
.