ఈ రోజుల్లో అవయవ మార్పిడి సర్వసాధారణం అయిపొయింది.ప్రతి ఒక్కరు కూడా తమ లో ఉన్న లోపాలను సరిచేసుకోవడానికి సర్జరీలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే ఇదే విధంగా తుంటికీలు(హిప్ జాయింట్) మార్పిడి కోసం అని ముంబై కి చెందిన ఒక చెఫ్ దుబాయ్ కు వెళ్ళింది.కానీ ఏమి జరిగిందో ఏమో గానీ ఆ చెఫ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలుస్తుంది.
వివరాల్లోకి వెళితే…ముంబై కి చెందిన బెట్టి రీటా ఫెర్నాండెజ్(42)ప్రముఖ చెఫ్.ఆమె పేరున ఒక సొంత బేకరీ కూడా ఉంది.
అయితే పుట్టుక తోనే ఆమె తుంటికీలు సమస్య తో బాధపడుతుంది.తుంటికీలు పక్కకు జరిగి ఉండడం తో నిత్యం ఇబ్బంది పడేవారు.
ఈ నేపథ్యంలో ఆమె తన తుంటికీలు కోసం శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకొని ఈ నెల 9 న దుబాయ్ లోని అల్ జహ్రా హాస్పిటల్ లో చేరారు.
ఈ క్రమంలో ఆమెకు ఆర్ధోపెడిక్ సర్జన్ సమిహ్ టర బిచి నేతృత్వం లో ఆపరేషన్ నిర్వహించారు.
దాదాపు రెండు గంటల పాటు ఈ సర్జరీ జరిగినట్లు తెలుస్తుంది.అయితే అనంతరం చికిత్స కొనసాగుతుండగా బెట్టి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.దీనితో బెట్టి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం తో దుబాయ్ ఆరోగ్యశాఖ(డీ హెచ్ ఏ) దర్యాప్తు జరుపుతుంది.అయితే అక్కడి వైద్యులు మాత్రం ఈ ఆపరేషన్ లో ఉన్న రిస్క్ లను ముందే వివరించామని ఆపరేషన్ జరిగిన తీరు,ఆ తరువాత పరిస్థితులను కూడా రోగి బంధులకు ఎప్పటికప్పుడు వివరించామని దర్యాప్తు కు పూర్తిగా సహకరిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.
అయితే బెట్టి మరణానికి డాక్టర్లు,సిబ్బంది నిర్యక్షం అని తేలితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీహెచ్ఏ వెల్లడించింది.వైద్యం వికటించడం తోనే బెట్టి మృతి చెందినట్లు ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం ఉందంటూ బెట్టి భర్త ఆరోపిస్తున్నారు.