ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సంస్థ తాజాగా 292 క్రికెటర్లతో ఫైనల్ లిస్ట్ ని విడుదల చేసింది.వీరంతా కూడా ఈసారి వేలంపాటలో అమ్ముడుపోయే ఆటగాళ్లే.
ఫిబ్రవరి 18వ తేదీన చెన్నైలో వేలంపాట జరగనున్నది.ఈసారి 1,114 మంది క్రికెట్ ఆటగాళ్లు ఐపీఎల్ 2021 లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నారు కానీ ఐపీఎల్ నిర్వాహకులు కేవలం 292 ఆటగాళ్లను మాత్రమే వేలం పాటకు ఫైనలైజ్ చేశారు.
ఈ వేలం పాటలో ఈసారి 164 మంది ఇండియన్ ప్లేయర్లు , 125 ఓవర్సీస్ ప్లేయర్లు, 3 అసోసియేట్ నేషన్స్ ప్లేయర్లు ఉన్నారు.అయితే ఫైనల్ లో స్థానం దక్కించుకున్న 164 మంది భారతీయ ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఉన్నారు.
దీంతో అతన్ని ఎవరు వేలం పాట పాడతారనే అంశం ఆసక్తికరంగా మారింది.అయితే అతడు తన కనీస ధరను రూ.20 లక్షలు గా నమోదు చేయించుకున్నాడు.
భారతదేశం నుంచి కేవలం హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్ లు మాత్రమే అత్యధిక కనీస ధర అయిన రూ.2 కోట్ల జాబితాలో ఉన్నారు.వీరితో పాటు గ్లెన్ మాక్స్ వెల్, స్టీవ్ స్మిత్, మోయిన్ అలీ, షకీబ్ అల్ హాసన్, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మార్క్ వుడ్ లు తమ కనీస ధరను రూ.2 కోట్లు గా నమోదు చేయించుకున్నారు.రూ .1.5 కోట్ల కనీస ధర జాబితా లో మొత్తం 12 మంది ప్లేయర్లు ఉన్నారు.వారంతా కూడా ఓవర్సీస్ ఆటగాళ్లే కావడం గమనార్హం.
రూ.కోటి కనీస ధర జాబితా లో మొత్తం 11 మంది ఉండగా వారిలో ఉమేష్ యాదవ్, హనుమ విహారి ఉన్నారు.
ఫిబ్రవరి 18వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రారంభం కానున్న వేలంపాటలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ రూ.53.20 కోట్లతో బరిలోకి దిగి తొమ్మిది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నది.కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు కేవలం పది కోట్ల రూపాయలతో వేలంపాట బరిలోకి దిగనున్నాయి.