ప్రపంచవ్యాప్తంగా అనేక దిగ్గజ సంస్థలకు సారథులుగా రాణిస్తున్న భారతీయుల సంఖ్య ప్రతియేటా పెరుగుతోంది.సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల, అజయ్ బంగా, అరవింద్ కృష్ణ, ఇంద్రా నూయి వంటి వారు భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నారు.
తాజాగా ఈ లిస్ట్లోకి మరో భారతీయుడు చేరాడు.ప్రముఖ పాదరక్షల సంస్థ బాటాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా భారత సంతతికి చెందిన సందీప్ కటారియా నియమితులయ్యారు.
బాటా ఇండియా సీఈవోగా వున్న ఆయన గ్లోబల్ సీఈవోగా ప్రమోట్ అయ్యారు.సందీప్ సారథ్యంలో బాటా భారత విభాగం వృద్ధి, లాభాలు నమోదు చేసిందని సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.
ముఖ్యంగా యువతకు మరింత చేరువయ్యేలా బాటాను తీర్చిదిద్దడంలో కటారియా కీలకపాత్ర పోషించారని ప్రశంసించింది.
బాటాకు సీఈవోగా కటారియా నియమితులవ్వడంతో ఎఫ్ఎంసీజీ మొదలుకుని ఐటీ సంస్థల దాకా ఇంటర్నేషనల్ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల జాబితాలోకి చేరిపోయారు.స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బాటా సంస్థ 1894లో ఏర్పాటైంది.5 ఖండాల్లో 22 ప్లాంట్లు ఉన్నాయి.70 పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.35,000 పైచిలుకు సిబ్బంది ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా 5,800 స్టోర్స్లో ఏటా 18 కోట్ల జతల పాదరక్షలను విక్రయిస్తోంది.భారత్లో ఏటా సుమారు 5 కోట్ల జతల పాదరక్షలు విక్రయిస్తోంది.125 సంవత్సరాల చరిత్ర గల బాటా షూ ఆర్గనైజేషన్కు ఒక భారతీయుడు సీఈవోగా నియమితుడవడం ఇదే ప్రథమం.దాదాపు అయిదేళ్ల పైగా సీఈవో స్థానంలో కొనసాగిన అలెక్సిస్ నాసార్డ్ స్థానంలో సందీప్ కటారియా నియమితులయ్యారు.
కాగా ఇండయాస్పోరా అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం భారత సంతతికి చెందిన 58 ఎగ్జిక్యూటివ్ల సారథ్యంలోని వివిధ కంపెనీల్లో 36 లక్షల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు.వీటి ఆదాయం లక్ష కోట్ల డాలర్లు, మార్కెట్ విలువ 4 లక్షల కోట్ల డాలర్ల పైగా ఉంది.అమెరికా, కెనడా, సింగపూర్ సహా 11 దేశాల్లో ఈ సంస్థలు ఉన్నాయి.