మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ లో ఇప్పటి వరకు నటుడుని మాత్రమే అందరూ చూసారు.అయితే కెరియర్ లో మొదటి సారి ఆయన మెగా ఫోన్ పట్టుకొని ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
డైరెక్టర్ చేయడమే ఎక్కువ అనుకుంటే ఏకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో త్రీడీ టెక్నాలజీలో తెరకెక్కిస్తూ ఉండటం విశేషం.లాక్ డౌన్ సమయంలోనే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చింది.
అయితే తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా బరోజ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.
ఇక ఇందులో టైటిల్ రోల్ ని కూడా మోహన్ లాల్ నటిస్తున్నాడు.మరో కీలక పాత్రలో పృద్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నాడు.
వాస్కోడిగామా భారతదేశంలోని తన నిధికి కాపలాగా ఉంచిన బరోజ్ అనే భూతం జీవితానికి సంబంధించిన కథతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
ఆ నిధికి అసలైన వారసుడి కోసం ఎదురు చూస్తున్న ఆ భూతాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఓ కుర్రోడికి బరోజ్ కు మధ్య సాగే ప్రయాణంతో ఈ సినిమా కథనం ఉంటుందని టాక్ వినిపిస్తుంది.
బరోజ్ ప్రారంభ కార్యక్రమానికి మోహన్ లాల్, పృథ్వీరాజ్ తో పాటుగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, లెజెండరీ డైరెక్టర్స్ ఫాజిల్, ప్రియదర్శన్ తదితరులు హాజరయ్యారు.మోహన్ లాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియచేశారు.
ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ ఫాంటసీ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
వచ్చే నెల ఆఖరు నుంచి బరోజ్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా షూటింగ్ కొచ్చి, గోవా, డెహ్రాడూన్ తో పాటు పోర్చుగల్ జరగనున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది.
మోహన్ లాల్ దర్శకత్వం వహించడంతో పాటు నటిస్తున్న సినిమా కావడం, అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతూ ఉండటంతో దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.