అమెరికా రాజకీయ రంగంలో భారత సంతతి నేతలు దూసుకెళ్తున్నారు.అక్కడి ప్రధాన రాజకీయ పక్షాలైన రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీలలో కీలక పదవుల్లో ఉన్నారు.
తాజాగా మెయిన్ రాష్ట్రం నుంచి డెమొక్రటిక్ సెనెటర్ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన సారా గిడియాన్ అభ్యర్ధిత్వాన్ని మాజీ అధ్యక్షుడు ఒబామా ఆమోదించారు.నవంబర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధుల పేర్లను ఒబామా ప్రకటించగా… ఆ పేర్లలో సారా గిడియాన్ కూడా ఉన్నారు.
ఆలోచనాత్మక, అధిక అర్హత కలిగిన వారిని సెనెటర్ అభ్యర్ధులుగా ఆమోదించడం గర్వంగా ఉందంటూ ఒబామా ఓ ప్రకటన విడుదల చేశారు.తాను ఆమోదించిన అభ్యర్ధులందరూ అమెరికన్ల కోసం పోరాటం చేస్తారని ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా అమెరికాలోని ప్రతిష్టాత్మకమైన రాష్ట్రాల్లో మెయిన్ కూడా ఒకటి.ఈ స్థానం నుంచి సారాను అభ్యర్ధిగా నిలబెడితే డెమొక్రటిక్ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
దీనికి తోడు ఇటీవల వచ్చిన ఫలితాల్లో సైతం సారాకు ఎక్కువ స్కోప్ వుందని తేలింది.ప్రస్తుతం ఇక్కడి నుంచి రిపబ్లికన్ పార్టీకి చెందిన సూసన్ కొల్లిన్స్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
సారా గిడియాన్ ప్రస్తుతం మెయిన్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరిస్తున్నారు.ఆమె తండ్రి భారతీయుడు కాగా.తల్లి అమెరికన్.సారా ఒకవేళ నవంబర్లో సెనెటర్గా ఎన్నికైతే.అమెరికా సెనెట్కు ఎన్నికైన రెండో భారతీయ అమెరికన్గా గుర్తింపు పొందుతారు.మరోవైపు రిపబ్లికన్ పార్టీ నుంచి మరో ఇద్దరు ఇండో అమెరికన్లు సైతం సెనెట్కు పోటీ చేస్తున్నారు.
డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష బరిలో నిలిచిన జో బిడెన్ సైతం సారాను సెనెటర్ అభ్యర్ధిగా ఆమోదించారు.కాగా కాలిఫోర్నియా నుంచి ఎన్నికైన కమలా హ్యారిస్ అమెరికా సెనెట్లో కాలుపెట్టిన తొలి భారత సంతతి మహిళగా రికార్డుల్లోకెక్కారు.