వందల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన గురుతర బాధ్యతను మరచిన ఓ పైలట్… ప్రయాణికులకు సేవలందించేందుకు నియమితురాలైన ఎయిర్ హోస్టెస్ పై వేధింపులకు పాల్పడ్డాడు.విమానం గాల్లో ఉండగానే అతడు తన పోకిరీ చేష్టలకు తెర తీశాడు.
ప్రయాణికుల సేవలను పక్కనపెట్టేసి తన పక్కన కూర్చోమంటూ ఎయిర్ హోస్టెస్ ను ఆదేశించాడు.అంతేకాకుండా టాయిలెట్ కంటూ కేబిన్ నుంచి బయటకు వెళ్లిన కో-పైలట్ ను తిరిగి లోపలికి అనుమతించలేదు.
చాలా సేపు బతిమాలాక తీరిగ్గా కో-పైలట్ కు అనుమతినిచ్చాడు.పైలట్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు ఎయిర్ హోస్టెస్ విమానం దిగగానే అతడిపై విమానయాన సంస్థకు ఫిర్యాదు చేసింది.
దీనిపై విచారణ చేపట్టిన ఆ సంస్థ అతగాడి ఉద్యోగాన్ని పీకేసి ఇంటికి సాగనంపింది.
కోల్ కతా-బ్యాంకాక్ మధ్య అప్ అండ్ డౌన్ జర్నీలో స్పైస్ జెట్ విమానంలో ఫిబ్రవరి 28న ఈ ఘటన చోటుచేసుకోగా, విచారణలో అతడు దోషిగా తేలడంతో పైలట్ ను ఆ సంస్థ విధుల నుంచి తొలగించింది.
ఇక పూర్తి స్థాయి విచారణలో అతడు దోషిగా తేలితే… అతడి పైలట్ లైసెన్స్ ను కూడా రద్దు చేయనున్నట్లు డీజీసీఏ ప్రకటించింది.
.