శ్రీలంక తరహాలో ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్న దేశాల్లో బంగ్లాదేశ్ కూడా చేరుతుందా? అంటే అవుననే అన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
బంగ్లాదేశ్ లో పెట్రోల్ ధర 84 టాకాలు ఉండగా.ఇటీవల ఒక్కసారిగా 44 టాకాలు అంటే 52 శాతానికి పెంచింది.
దీంతో పెట్రోల్ రేటు 130 టాకాలకు చేరింది.డీజిల్ ధరలను సైతం 34 టాకాలు పెంచింది.
దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.దేశ వ్యాప్తంగా ప్రజలు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.
పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది.
కరోనా వ్యాప్తి అనంతరం విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడం, ఎగుమతులు తగ్గడం, దిగుమతులు పెరిగి వాణిజ్య లోటు ఏర్పడటం వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.ఒక్కసారిగా నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్ ఉత్పత్తుల ధరలను పెంచేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం.
అయితే, 1971లో స్వాతంత్య్రం పొందగా ఇప్పటివరకు ఎప్పుడూ పెట్రోల్ ధరలు పెంచలేదని విశ్లేషకుల వాదన.మరోవైపు ఆ దేశ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరిగా ధరలు పెంచాల్సి వచ్చిందని ప్రకటించింది.