అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ప్రముఖ ఆర్ధిక సేవల సంస్థ గోల్డ్మన్ సాచ్స్ బెంగళూరు కార్యాలయం గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్గా అవతరించింది.తద్వారా బ్యాంక్కు కీలకమైన టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్గా గుర్తింపు సంపాదించింది.2004లో కేవలం 291 మంది నిపుణులతో కార్యకలాపాలు ప్రారంభించిన బెంగళూరు కేంద్రం దినదినాభివృద్ధి చెందిందని భారత్లోని గోల్డ్మన్ సాచ్స్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్ గుంజన్ సమతాని తెలిపారు.ప్రస్తుతం ఇక్కడ 6,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా,.
వారిలో సగం మంది ఇంజనీర్లే.గతేడాది నుంచి బెంగళూరులోని గోల్డ్ మన్ కార్యాలయం న్యూయార్క్లోని హెడ్ ఆఫీస్ తర్వాత ఇంజనీర్ల పరంగా ప్రపంచంలోనే రెండవ స్థానంలో నిలిచింది.
నైపుణ్యం కలిగిన మానవ వనరులు, తక్కువ ఖర్చు కారణంగా భారత్ గత కొన్నేళ్లుగా జీఐసీ (గ్లోబల్ ఇన్హౌస్ సెంటర్లు) లకు కేంద్రంగా అవతరించింది.నాస్కామ్ నివేదిక ప్రకారం.2018 ఆర్ధిక సంవత్సరానికి గానూ మనదేశంలోని జీఐసీలు 9,00,000 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాయి. మానవ వనరులు, విభిన్నమైన పర్యావరణ వ్యవస్థ కారణంగా భారత్లోని జీఐసీలలో 40 శాతం బెంగళూరులోనే ఉన్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల సాయంతో ప్రపంచ స్థాయి వ్యాపారానికి మద్ధతు ఇవ్వడంలో బెంగళూరు గోల్డ్మన్ సాచ్స్ ఇంజనీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ ఇంజనీరింగ్ బృందంలో సాంకేతిక సామర్ధ్యం వున్న వారితో పాటు వ్యూహకర్తలు ఉన్నారు.బెంగళూరు కార్యాలయంలో సుమారు 500 మంది వ్యూహకర్తలు ఉన్నారని సమతాని తెలిపారు.
అమెరికా, యూకేలలోని రిటైల్ కస్టమర్లకు రుణాలు, పొదుపు ఖాతాలను అందించే ఆన్లైన్ ప్లాట్ఫాం ‘‘ మార్కస్ ’’ను నిర్మించడంలో బెంగళూరు కేంద్రం కీలక పాత్ర పోషించింది.
తమ వద్ద డేటా సైంటిస్టులు, ప్రొడక్ట్ డిజైన్ మేనేజర్లు, సాంకేతిక నిపుణులు ఉన్నారని సమతాని పేర్కొన్నారు.వీరంతా కస్టమర్ ఫేసింగ్, ప్రొడక్ట్ ఫీచర్ ఫంక్షనాలిటీలను అభివృద్ధి చేయడంలో సాయపడతారని ఆయన చెప్పారు.
ప్రస్తుతం కరోనా కారణంగా బెంగళూరు కార్యాలయానికి చెందిన 99 శాతం మంది సిబ్బంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు.అయినప్పటికీ నాణ్యతలో ఎలాంటి మార్పు రాలేదని సమతాని వెల్లడించారు.