టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉంటూ కమెడియన్ గా సత్తా చాటారు బండ్ల గణేష్.ఆ తరువాత నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ హీరోలుగా నటించిన పలు సినిమాలను బండ్ల గణేష్ నిర్మించారు.
గత కొంతకాలంగా సినీ నిర్మాణానికి దూరంగా ఉన్న బండ్ల గణేష్ 2018 సంవత్సరంలో తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరారు.అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బండ్ల ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు.
అనంతరం గతేడాది ఏప్రిల్ నెలలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు బండ్ల గణేష్ ప్రకటన చేశారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో చేసిన కొన్ని కామెంట్ల వల్ల బండ్ల గణేష్ ఎన్నికల ఫలితాల అనంతరం ట్రోలింగ్ కు గురయ్యారు.ప్రస్తుతం బండ్ల గణేష్ సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉన్నారు.భవిష్యత్తులో బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ సంవత్సరం బండ్ల గణేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించగా ఆ పాత్ర ఆకట్టుకోలేకపోయింది.
అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొందరు నెటిజన్లు బండ్ల గణేష్ ను రాజకీయాల్లోకి లాగి రచ్చ చేస్తున్నారని సమాచారం.
దీంతో ఆవేదన చెందిన బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా తనను రాజకీయాల్లోకి లాగొద్దని.తనకు, రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.
తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని అన్నారు.
గతంలో తాను మాట్లాడిన మాటలను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని దయచేసి అలాంటి పనులు చేయవద్దని బండ్ల గణేష్ కోరారు.
బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.బండ్ల పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.