తెలంగాణ కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, ఒకరి ఎదుగుదలను మరొకరు అడ్డుకుంటూ, నిత్యం సొంత పార్టీ నాయకులపైనా విమర్శలు చేసుకుంటూ కాంగ్రెస్ మరింతగా దెబ్బతింటూ వస్తోంది.ఒకరిద్దరు నాయకులు ఆ పార్టీలో యాక్టివ్ గా ఉన్నా, మిగిలిన వారు తగిన విధంగా సహకరించకపోవడం వంటి కారణాలతో చాలాకాలంగా కాంగ్రెస్ బలహీనపడుతూ వస్తోంది.
దీంతో ప్రధాన ప్రతిపక్షం తానే అన్నట్లుగా బీజేపీ బలం పెంచుకుంటూ వస్తోంది.ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ, బీజేపీ కి మరింత క్రెడిట్ పెరిగే విధంగా చేయగలిగారు.
నిత్యం టిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఆ పార్టీని అన్నిరకాలుగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అడుగడుగున కేసీఆర్ నిర్ణయాలకు అడ్డుపడుతూ, మీడియా ముఖంగా నిలదీస్తూ, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మరి ఆందోళన నిర్వహిస్తూ వస్తున్నారు.
నిఘా వర్గాల సమాచారం మేరకు బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టిఆర్ఎస్ హవా తగ్గిందని బీజేపీ బాగా బలం పెంచుకుంది అనే రిపోర్ట్స్ కూడా రావడంతో టిఆర్ఎస్ లోనూ కాస్త కలవరం కనిపిస్తోంది.దీనికి తోడు ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో, అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది.
కొద్దిరోజులుగా కేంద్ర బీజేపీ నాయకులను ఉద్దేశించి, కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శిస్తూ, కేసిఆర్ చేస్తున్న విమర్శలకు బండి సంజయ్ ఘాటుగానే సమాధానాలు ఇస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న కొత్త విద్యుత్ చట్టం ప్రమాదకరం అంటూ అసెంబ్లీలో కేసిఆర్ మాట్లాడిన మాటలపైన ఘాటుగానే సంజయ్ స్పందించాడు.
రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో కేసీఆర్ చేస్తున్న మాయాజాలం బయటపడుతుందనే, అబద్ధాలు చెబుతున్నారని విద్యుత్ సవరణ చట్టం తో ఉద్యోగాలు పోతాయని కేసిఆర్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.విద్యుత్ బిల్లు డ్రాఫ్ట్ మాత్రమే వచ్చిందని, ఇంకా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టలేదని, కానీ కేసీఆర్ ఏదో జరిగిపోతుందని భయాందోళన సృష్టిస్తూ విమర్శలు చేయడం సరికాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదు ఈ వ్యవహారంలో జగన్ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. విద్యుత్ చట్ట సవరణ మంచిదే అని ఏపీ సీఎం, నీ తమ్ముడు జగన్ ఎందుకు చెప్పాడని సంజయ్ కేసీఆర్ ను ప్రశ్నించారు.
జగన్ ఒక జీవో కూడా విడుదల చేశారని, అవసరమైతే మరోసారి మీ తమ్ముడు జగన్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకుని దావత్ ఇవ్వు .విద్యుత్ చట్ట సవరణ గురించి చెప్తాడు అంటూ సంజయ్ చురకలు అంటించారు.ఇలా ప్రతి విషయంలోనూ బండి సంజయ్ కేసీఆర్ కు అడ్డుపడుతూనే బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు.