తెలంగాణలో బలంగా ఉన్న అధికార పార్టీ టిఆర్ఎస్ కు ధీటుగా బీజేపీని బలోపేతం చేయాలంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు అనే విషయాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గుర్తించారు.కాంగ్రెస్ కంటే బీజేపీ ప్రభావం తెలంగాణలో పెరగడం కాస్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
బీజేపీ ఎత్తుగడలకు ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ కౌంటర్ ఇస్తూ, పై చేయి సాధిస్తుండడం వంటి వ్యవహారాలతో సరికొత్త రూట్ లో బీజేపీ ని తీసుకువెళ్లగలిగితేనే ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని గుర్తించారు.ఈ మేరకు పార్టీలో చేరికల విషయమై ఆయన ఎక్కువ దృష్టి సారించారు.
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ద్వారానే 2023 ఎన్నికల్లో అధికారంలోకి రాగలము అనే విషయాన్ని బలంగా నమ్ముతున్నారు.ఇప్పటికే పార్టీలో కి పెద్ద ఎత్తున ఇతర పార్టీల నాయకులు చేరేందుకు సంప్రదిస్తూ ఉండటం, మాజీ ఎమ్మెల్యేలు , రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు, ఇతర పార్టీల్లోని కీలక నాయకులుగా గుర్తింపు పొందిన వారు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తూ ఉండడంతో ఆ చేరికల విషయంలో కొన్ని నిబంధనలు విధించాలని భావిస్తున్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజా సమస్యల విషయంలో పోరాటం చేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు పదేపదే సూచిస్తున్నారు.ఎక్కడికక్కడ స్థానిక అంశాలను హైలెట్ చేసుకుంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శల తో విరుచుకుపడుతూ ఉండడం ద్వారానే ప్రజల్లో బీజేపీకి మంచి గుర్తింపు వస్తుందని సంజయ్ నమ్ముతున్నారు.
ప్రస్తుతం చేరికల విషయమై సంజయ్ దృష్టి పెట్టడంతో తాజాగా జాయినింగ్ కమిటీ తో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీలో చేరేందుకు కాంగ్రెస్ , టిఆర్ఎస్ , కాంగ్రెస్ కు చెందిన అనేక మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ లను బీజేపీలో చేర్చుకునే అంశంపై బండి సంజయ్ జిల్లా పార్టీ అధ్యక్షులు జాయినింగ్ కమిటీ నాయకుల తోనూ మాట్లాడుతున్నారు.అయితే ఈ చేరికల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజా బలం వున్న వారిని, పార్టీకి ఉపయోగపడతారు అనుకున్న వారికి మాత్రమే బీజేపీలో చేరే అవకాశం ఇవ్వాలని , మిగతావారిని చేర్చుకున్నా, పార్టీకి వారి వల్ల ఉపయోగం ఉండదు అనుకుంటే అటువంటి వారి చేరికలకు బ్రేకులు వేయాలని సంజయ్ జాయినింగ్ కమిటీ నాయకులతో మాట్లాడుతున్నారట.
ఇప్పటికే తుక్కు కూడా మున్సిపల్ చైర్మన్ మధుసూదన్ టిఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు.
ఈ నెల 16వ తేదీన యువ తెలంగాణ పార్టీ ని బీజేపీలో విలీనం చేయబోతున్నారు.ఆ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమదేవి తో పాటు మరెంతో మంది నాయకులు బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు.ముందు ముందు ఈ చేరికలు మరింత ఉధృతంగా ఉంటాయని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈనెల 12వ తేదీన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాయినింగ్స్ కమిటీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, జాయినింగ్స్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు సమావేశమై కీలక అంశాలపై చర్చించబోతున్నారట.