త్వరలో కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.ప్రస్తుతం కొందరు కేంద్రమంత్రులు రాజీనామా చేశారు.
కేంద్రమంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్సీపీ సింగ్ తమ పదవుల నుంచి తప్పుకున్నారు.ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఉపరాష్ట్రపతి రేసులో ఉండటంతోనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారంటూ ప్రచారం జరుగుతోంది.అటు మోదీ 2.0 కేబినెట్లో స్టీల్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆర్సీపీ సింగ్ కూడా తన పదవికి రాజీనామా చేయడం హాట్ టాపిక్గా మారింది.
ఇద్దరు కేంద్రమంత్రులు రాజీనామా చేయడంతో వారి స్థానంలో కొత్త వారిని నియమించాల్సి ఉంటుంది.ఈ ఏడాది డిసెంబరులో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, వచ్చే ఏడాది కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
త్వరలో జరనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా రానున్న సార్వత్రిక ఎన్నికలను పరిగణలోకి తీసుకుని కేంద్ర మంత్రి వర్గంలో కూర్పు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణలో పాగా వేయాలని ఎప్పటి నుంచో బీజేపీ ఎదురుచూస్తోంది.
అందుకే ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సైతం వేదికగా హైదరాబాద్ను ఎంచుకుంది.ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి మరో నేతను కేంద్ర కేబినెట్లోకి తీసుకోవాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి ఒక్కరే కేంద్ర కేబినెట్లో కొనసాగుతున్నారు.తెలంగాణ నుంచి తాజాగా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ నేత లక్ష్మణ్తో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
ఇప్పటికే బండి సంజయ్ తెలంగాణలో పార్టీని తన భుజాలపై వేసుకుని కొన్ని ఎన్నికల్లో గెలిపించారు.దీంతో ఆయన కష్టాన్ని గుర్తించి కేంద్ర మంత్రి పదవిని ఇవ్వాలనే యోచనలో బీజేపీ అధిష్టానం ఉందని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు.బీజేపీ కార్యవర్గ సమావేశాల ముగింపు వేళ కూడా బహిరంగ సభా వేదికపైనే ప్రధాని మోదీ పార్టీ రాష్ట్ర చీఫ్ బండి భుజం తట్టి అభినందించారు.ఒకవేళ బండి సంజయ్ను రాష్ట్ర రాజకీయాలకే పరిమితం చేయాలనుకుంటే జాతీయ నేతలతో సత్సంబంధాలు కలిగిన లక్ష్మణ్కు అవకాశం కల్పించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.