బైబిల్ పార్టీ కావాలా ? భగవద్గీత పార్టీ కావాలా అంటూ గతంలో ఏపీ అధికార పార్టీ వైసీపీ ని ఉద్దేశించి తెలంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.ఏపీలో పాగా వేయాలని ఎప్పటి నుంచో ఆశ పడుతున్న బీజేపి అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా వినియోగించుకునే పనిలో పడింది.
తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం పొందడంతో, అక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.దీంతో ఇక్కడ సత్తా చాటుకునేందుకు బిజెపి రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.
ఇక్కడ పోటీ చేసేందుకు జనసేనను సైతం ఒప్పించింది.అంతేకాదు ఏప్రిల్ 3వ తేదీన పవన్ సైతం తిరుపతి లో పర్యటించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
పవన్ మాత్రమే కాకుండా, బీజేపి అగ్ర నాయకులు సైతం తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఏదో రకంగా వైసీపీ పై పట్టు సాధించేందుకు బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది.ఇది ఇలా ఉంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తిరుపతి పర్యటనకు రాబోతున్నారట.గతంలోనే ఆయన వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో వచ్చిన రెస్పాన్స్ ను ఇప్పుడు లెక్క వేసుకుంటున్న బీజేపీ బండి సంజయ్ ద్వారా వైసీపీ పై ఘాటు విమర్శలు చేయించాలని, వైసిపి ఓటు బ్యాంకును దెబ్బ తీసి, దానిని బీజేపీకి అనుకూలంగా మార్చుకోవాలని ఎత్తుగడలు వేస్తోంది.
దుబ్బాక ఉప ఎన్నికలలో బండి సంజయ్ చూపించిన స్పీడ్ ను ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటూ , తిరుపతి లో ప్రచారాన్ని హోరెత్తించే పనిలో పడింది.
అవసరం అయితే ఎన్నికల ప్రచారానికి ముగింపు పడే వరకు సంజయ్ ను తిరుపతి లోక్ సభ నియోజక వర్గానికి పరిమితి చేసి, ఆ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహించే విధంగా సంజయ్ ను బీజేపీ అధిష్టానం రంగంలోకి దింపే ఆలోచనలో ఉందట.
ఈ పరిణామాలతో వైసీపీ సైతం కాస్త కంగారు పడుతోందట.సంజయ్ ముఖ్యంగా హిందుత్వం అంశాన్ని హైలెట్ చేసి తమను దెబ్బతీస్తాడు అనే టెన్షన్ పడుతోందట.