ఈ సంవత్సరం ఐపిఎల్ సీజన్ ప్రారంభం అవ్వక ముందు కరోనా వైరస్ ప్రభావం టోర్నమెంట్ పై పడుతుంది.ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడినట్లుగా అర్థమవుతుంది.
తాజాగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చెందిన ఆటగాడు డేనియల్ సామ్స్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఆర్సిబి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
ప్రస్తుతం డేనియల్ ఐసోలేషన్ లో ఉన్నారని తెలిపింది.
వాస్తవానికి ఆస్ట్రేలియా ఆటగాడు డేనియల్ సామ్స్ ఏప్రిల్ 3న కరోనా పరీక్షలు చేయించుకోగా రిపోర్ట్ లో నెగటివ్ రావడంతో ఆర్సిబి శిబిరానికి చేరుకున్నట్లు సమాచారం.
అయితే తాజాగా రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా ఈసారి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.దీంతో వెంటనే బిసిసిఐ కరోనా వైరస్ నిబంధనల ప్రకారం అతడిని ఐసోలేషన్ వార్డులో పంపించారు.
ప్రస్తుతం అతడికి ఎలాంటి లక్షణాలు లేవని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.ఇలా ఉండగా ఇప్పటికే ఆర్సిబి ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ కరోనా వైరస్ బారిన పడ్డట్లు మనకు తెలిసిందే.
కానీ, ప్రస్తుతం అతడు కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు అక్షర్ పటేల్, కేకేఆర్ కు చెందిన నితీష్ రానా, ముంబై ఇండియన్స్ సలహాదారుడు కిరణ్ మోర్ కూడా ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన సంగతి అందరికీ విధితమే.
ఏది ఏమైనా కానీ ఈసారి ఐపిఎల్ సీజన్ ఎలా కొనసాగుతుందో అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది.