తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలోని విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి.ముఖ్యంగా ఇటీవల జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన లో టిఆర్ఎస్ కు చెందిన కీలక నేతల కుమారులు నిందితులుగా ఉండడంతో, ఈ అంశంలో టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.
బచావో హైదరాబాద్ పేరుతోనే ఈ సభను నిర్వహించేందుకు అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయి.సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ వ్యవహారంపై చర్చించారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు.తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల ఘటనల నేపథ్యంలో నిన్న నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దాదాపు మూడు లక్షల మంది మహిళలతో భారీ సభను ఏర్పాటు చేసేందుకు అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఈమేరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మహిళా సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ సభకు తెలంగాణ కు చెందిన నాయకులే కాకుండా, జాతీయ స్థాయి నాయకులను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు.దీనిలో భాగంగానే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాలనే ఆలోచనలో ఉన్నారు.
వరంగల్ లో నిర్వహించిన రైతు సభ తరహాలోనే మహిళా సభను నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.రాహుల్ గాంధీతో పాటు బృందాకారత్ వంటి జాతీయ స్థాయి నాయకులను ఈ మహిళ సభకు ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సభ నిర్వహణ ముఖ్య ఉద్దేశం టిఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకునే అనే విషయం పై అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.జాతీయ పార్టీని ఏర్పాటు చేసుకునే దిశగా కేసీఆర్ ముందుకు వెళ్తుండటంతో.ఇప్పుడు ఆయనను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించడం , భారీ స్థాయిలో మహిళా సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.