ఏపీ రాజకీయాలు ఇప్పుడు మంచి ఊపుమీద ఉన్నాయి.అన్ని పార్టీలు తమ బలం, బలగం పెంచుకునే పనిలో ముందుకు వెళ్తున్నాయి.
అధికార పార్టీ అనేక సంక్షేమ పథకాలు, ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తూ నియామకాలు పూర్తిచేస్తూ ముందుకు వెళ్తుండగా అధికార పార్టీ చేస్తున్నతప్పులను ఎండగట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.తెలుగుదేశం.
ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల రెండు నెలల నుంచే విమర్శల బాణాలు వదులుతున్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ దాడులు చేస్తోందని, గ్రామాల్లోకి రానివ్వడం లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి ప్రభుత్వాన్నిఇరుకునపెట్టేందుకు ప్రయత్నాలు బలంగా చేస్తోంది.
రద్దుల పద్దులు, కూల్చివేతలు, నిలిపివేతల ప్రభుత్వమంటూ విమర్శలు చేస్తున్నారు.అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతూ జగన్ ముందుకు దూసుకుపోతున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ వ్యతిరేక పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తోంది.
బీజేపీ కూడా ఈ మధ్య వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు తీవ్రతరం చేస్తోంది.ఇటీవల రాజధాని రైతులకు బాసటగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆందోళనల్లో పాల్గొంటూ విమర్శలు చేస్తున్నారు.ఇటీవల తిరుమలలో అన్యమత ఉద్యోగులు, సీమకు నీళ్లు, నిధులంటూ బీజేపీ నేతలు గొంతు పెంచి మాట్లాడుతున్నారు.
అటు జనసేన కూడా జగన్ వంద రోజుల పాలనలో చేసిందేమీ లేదంటూ విమర్శలు చేస్తోంది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు అవ్వడంలేదు అంటూ పవన్ కామెంట్లు చేస్తున్నారు.
దీంతో అటు బీజేపీ, ఇటు జనసేనలు కూడా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది.ఈ నేపథ్యంలో మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే పూర్తి స్థాయిలో ప్రయోజనం ఉంటుందని టీడీపీ భావిస్తోంది.
దీనికి తోడు బీజేపీకి దగ్గరైతే, అన్ని విధాలా తనకు మంచిదని ఆలోచిస్తున్నారట.అందుకే బీజేపీలోని తన సన్నిహితుల ద్వారా, బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే బీజేపీ మాత్రం టీడీపీని దగ్గర చేసుకునేందుకు ఇష్టపడడంలేదు.ఎందుకంటే ఏపీలో టీడీపీ స్థానాన్ని ఆక్రమించుకుని వైసీపీకి ప్రత్యామ్న్యాయంగా ఎదగాలనే ఆలోచనలో బీజేపీ ఉంది.అందుకే సీమ వెనకబాటుతనం, తిరుమల వివాదాలు, రాజధానిపై నిర్లక్ష్యం వంటి భావోద్వేగ అస్త్రాలను బీజేపీ వదులుతోండి.మరి టీడీపీ స్థానాన్ని ఆక్రమించి ఎదగాలనుకుంటున్న బీజేపీ, అదే టీడీపీతో ఎలా కలుస్తుందనేది ఎవరికీ అంతుపట్టడంలేదు.
అందుకే తమతో తిరిగి కలవాలనుకుంటున్న చంద్రబాబుకు దూరం దూరంగా జరుగుతోంది బీజేపీ.టీడీపీతో పొత్తు ప్రస్తావన అసలు తీసుకురావద్దని,రాష్ట్ర నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తోంది.టీడీపీలో అసంతృప్తులు, కీలకమైన నాయకులు బీజేపీలోకి వచ్చేలా చక్రం తిప్పాలని చూస్తోంది.బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తుంటే చంద్రబాబును వీలైనంత దూరం పెట్టాలని బీజేపీ హైకమాండ్ చూస్తోంది.
ఇక జనసేన కూడా టీడీపీతో జత కట్టేందుకు వెనకడుగు వీస్తుండడం బాబు లో ఆందోళన పెంచుతోందట.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీ మద్దతు కూడగట్టాలని బాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడట.