పరిపాలనలో రాజకీయ నాయకుల ప్రాధాన్యం ఈమేరకు ఉంటుందో అదే రేంజ్ లో అధికారుల పాత్ర కూడా ఉంటుంది.ఇందులో ఎవరెక్కువ ఎవరు తక్కువ అనే పంతాలకు పోకుండా రైలు పట్టాలు వలె పరిపాలనలో కలిసి వెళ్ళిపోవాలి.
సాధారణంగా ఈ విధంగానే ఎక్కడైనా జరుగుతూ వస్తుంది.అయితే ఇప్పుడు ఏపీలో పోలింగ్ ముగిసి ఫలితాల కోసం వెయిటింగ్ చేస్తున్న సమయంలో ఎన్నికల కమిషన్ చే నియమించబడ్డ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం వర్సెస్ చంద్రబాబు అన్నట్టు ఉండడంతో గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది.
బాబు అధికారం చెలాయించకుండా అడుగడుగునా అడ్డం పడుతుండడంతో అధికారకంగానే అతని అడ్డు తొలిగించుకోవాలని బాబు చూస్తున్నాడు.
ఏపీలో తుఫాను ప్రభావం కారణంగా నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ సడలించిన తర్వాత, ఆ జిల్లాల్లో సహాయ చర్యలపై జరిపిన సమీక్షా సమావేశానికి చీఫ్ సెక్రటరీ ఎల్వీ మాత్రం హాజరుకాలేదు.
కానీ మిగతా అధికారులు హాజరవ్వడంతో వారితోనే సమీక్ష జరిపి నష్టపరిహారం, సహాయ, పునరావాస చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు.కాకపోతే సీఎస్ వ్యవహరిస్తున్న తీరుపై ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించకూడదు అని బాబు నిర్ణయించుకున్నారు.
అందుకే నేరుగా మీడియా సమావేశం పెట్టి మరీ సీఎస్ మీద విమర్శల వర్షం కురిపించారు.అన్ని రాష్ట్రాల్లో చీఫ్ సెక్రటరీలు సీఎంకి రిపోర్ట్ చేస్తారని కానీ ఏపీలో మాత్రం ఎందుకు రావడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు.
తాము వెళ్లి రివ్యూ మీటింగ్లకు రావాలని సీఎస్ను బతిమాలుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక సైలెంట్ గా ఉంటే లాభం లేదని, ఏపీలో ఎన్నికల పేరుతో తనను అడుగడుగునా అడ్డుకుంటున్నారని, ఇకపై అలా జరగడానికి వీల్లేదని అందుకే మంత్రి మండలి మీటింగ్ పెట్టి మరీ అతనిపై చర్యలు తీసుకోవాలని బాబు ప్లాన్ రెడీ చేస్తున్నారట.ఏ అధికారైనా హద్దులు దాటితే కేబినెట్ భేటీ నిర్వహించి బిజినెస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటానని ప్రకటించారు.ఇప్పటికే ఎల్వీ హద్దులు దాటారని బాబు చెప్పుకొచ్చారు.
బాబు వ్యవహారం చూస్తుంటే కేవలం సీఎస్ టార్గెట్ గానే ఆ మీటింగ్ పెట్టబోతున్నట్టు అర్ధం అవుతోంది.తనకు వచ్చే వారం క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టబోతున్నాని, తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని కూడా బాబు సవాల్ విసురుతుండడం, ఈ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది.