సంక్రాంతి సీజన్ను క్యాష్ చేసుకోవాలని టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ తమ సినిమాలను పండగ సమయంలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.ఈ క్రమంలో స్టార్ హీరోలు తమ సినిమాలను పోటీపడి మరీ సంక్రాంతికి రిలీజ్ చేసి నిర్మాతలతో పాటు ఇండస్ట్రీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తుంటారు.
ఈ సంక్రాంతికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమాను తొలుత జనవరి 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ భావించారు.
అటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’ని జనవరి 12న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.కానీ బన్నీ సినిమా నిర్మాతలు పండగతో పాటు వీకెండ్ వసూళ్లను కొల్లగొట్టేందుకు తమ సినిమాను జనవరి 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
దీంతో మహేష్ సినిమాను జనవరి 10న రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు.
ఇలా ఒక సినిమా కోసం మరొక సినిమాను ప్రీపోన్ చేయడం మంచిది కాదని పలువురు విశ్లేషకులు తెలిపారు.
అయితే రిలీజ్ విషయంలో తాజాగా రెండు చిత్రాల నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారు.ముందుగా అనుకుంటున్నట్లుగానే తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు ఒప్పుకున్నారు.
చిత్ర నిర్మాతలు తమ సినిమాలను అనుకున్న సమయంలో రిలీజ్ చేస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద ఊరట లభించింది.
ఈ తాజా నిర్ణయం ప్రకారం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అంటూ జనవరి 11న వస్తుండగా, అల వైకుంఠపురములో అంటూ బన్నీ 12న వస్తున్నాడు.వీరికి తోడుగా ఎంత మంచివాడవురా అంటూ కళ్యాణ్ రామ్ జనవరి 15న వస్తున్నాడు.కాగా వీరందరికీ ముందే దిగుతున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్.
తన దర్బార్ చిత్రాన్ని జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.మరి ఈ సంక్రాంతి పండగ బరిలో ఎవరు గెలుస్తారో చూడాలి.