ఆస్ట్రేలియాలో కరోనా కేసులు కనీవినీ ఎరుగని స్ధాయిలో పెరుగుతున్నాయి.లాక్డౌన్, కఠినమైన ఆంక్షలు విధిస్తున్నా కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంపై ప్రభుత్వం తల పట్టుకుంటోంది.
ఇప్పటికే దేశంలో అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని సిడ్నీ దాదాపు నెల రోజుల నుంచి లాక్డౌన్లో వుంది.పరిస్ధితి అదుపులోకి రాకపోవడంతో దానిని మరో నాలుగు వారాలు పొడిగించారు.
తాజాగా ఆస్ట్రేలియాలోని మూడో అతిపెద్ద నగరం బ్రిస్బేన్ కూడా లాక్డౌన్ జాబితాలో చేరింది.ఈ పట్టణంతో పాటు క్వీన్స్లాండ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు శనివారం నుంచి లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి.
బ్రిస్బేన్తో పాటు రాష్ట్రంలోని మిలియన్ల మంది శనివారం నుంచి మూడు రోజుల పాటు స్టే ఎట్ హోమ్ ఆదేశాల పరిధిలోకి వస్తారని రాష్ట్ర డిప్యూటీ ప్రీమియర్ స్టీవెన్ మైల్స్ తెలిపారు.
కాగా శనివారం ఇక్కడి క్లస్టర్లో కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి.
ఒక పాఠశాల విద్యార్ధి వల్లే ఈ కేసులు వెలుగుచూసినట్లుగా అధికారులు చెబుతున్నారు.దీంతో రెండు పాఠశాలల్లోని విద్యార్ధులు, ఉపాధ్యాయులను ఐసోలేషన్లో వుంచారు అధికారులు.
జీనోమ్ స్వీక్వెన్సింగ్ క్లస్టర్ను విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల కోసం క్వారంటైన్ సెంటర్గా మార్చారు.అయితే ప్రస్తుత కరోనా వ్యాప్తికి కారణంపై స్పష్టమైన కారణాలు తెలియాల్సి వుందని చీఫ్ హెల్త్ ఆఫీసర్ జీనెట్ యంగ్ పేర్కొన్నారు.
వచ్చే మూడు రోజులు బ్రిస్బేన్లో కఠినమైన లాక్డౌన్ కారణంగా సరైన కారణం లేకుండా ప్రజలను బయటకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.కేవలం నిత్యావసర వస్తువుల కొనుగోలు, వ్యాయామం కోసం మాత్రమే అనుమతిస్తామని వెల్లడించారు.
మరోవైపు సిడ్నీ నగరం ఐదువారాల లాక్డౌన్ను పూర్తి చేసుకుంది.అక్కడ డెల్టా వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు.శనివారం సిడ్నీలో కొత్తగా 210 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు అధికారులు తెలిపారు.అయితే వారం మొదట్లో నమోదైన కేసులతో పోలిస్తే ఇది కాస్త తక్కువ కావడంతో ప్రభుత్వ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
దేశ జనాభాలో కేవలం 14 శాతం మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తికావడంతో.వైరస్ చైన్ను బ్రేక్ చేయడానికి, ప్రజల కదలికలను తగ్గించడానికి ప్రభుత్వం లాక్డౌన్ మీద ఆధారపడింది.
శుక్రవారం ప్రధాని స్కాట్ మోరిసన్ మాట్లాడుతూ.ఆంక్షలకు సంబంధించి రోడ్ మ్యాప్ను వివరించారు.
లాక్డౌన్ను ఎత్తివేసే నాటికి జనాభాలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేస్తామని తెలిపారు.