పారిశ్రామికంగా, ఆర్ధికంగా, సైనికంగా భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు.
భారత్తో సంబంధాలను పెంచుకునేందుకు పలు దేశాలు ప్రాధాన్యతను ఇస్తున్నాయి.ఇందులో అగ్రరాజ్యాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాలు వున్నాయి.
ఈ క్రమంలోనే భారత్ కు వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధుల రాకపోకలు పెరిగాయి.తాజాగా పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్ రోజర్ హ్యు కుక్ నేతృత్వంలోని ఆస్ట్రేలియన్ ప్రతినిధి బృందం జూలై 6 నుంచి 8 వరకు పంజాబ్ రాష్ట్రంలో పర్యటించనుంది.
జూలై 6న అమృత్సర్ లోని ప్రఖ్యాత స్వర్ణ దేవాలయాన్ని ప్రతినిధులు సందర్శించనున్నారు.తర్వాత జూలై 8న చండీగఢ్, మొహాలీలోని పంజాబ్ ప్రభుత్వ అధికారులతో వీరు భేటీ అవుతారు.
భారత సంతతికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పర్వీందర్ కౌర్, పంజాబీ రచయిత మింటూ బ్రార్ ఈ ప్రతినిధి బృందంలో వున్నారు.ఈ పర్యటన వల్ల పంజాబ్- పశ్చిమ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
మింటూ బ్రార్ మాట్లాడుతూ.ఆస్ట్రేలియాలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఈ ప్రతినిధి బృందంలో భాగంగా వున్నారని చెప్పారు.ఈ పర్యటన వల్ల పంజాబ్ – ఆస్ట్రేలియాలకు వాణిజ్యం, పెట్టుబడి, సంస్కృతికి సంబంధించిన వివిధ రంగాల్లో ప్రయోజనం కలుగుతుందని మింటూ బ్రార్ ఆకాంక్షించారు.
పర్వీందర్ కౌర్ మాట్లాడుతూ.ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి, భారతీయ మార్కెట్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాకి వ్యాపార అవకాశాలను పెంచడంతో పాటు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ప్రోత్సహించేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందన్నారు.పర్యాటకులు, విద్యార్ధులు, ప్రతిభ, వ్యాపారం, పెట్టుబడి రంగాలపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు పర్వీందర్ తెలిపారు.
పంజాబ్ తో పాటు ఢిల్లీ, ముంబై, విజయవాడ, చెన్నై నగరాల్లోనూ పలు కార్యక్రమాల్లో ఈ బృందం పాల్గొంటుందని ఆమె వెల్లడించారు.భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.1.3 బిలియన్ల జనాభాను కలిగి వుందన్నారు.యువత, వైవిధ్య భరితమైన ఆర్ధిక వ్యవస్థ, బలమైన వృద్ధి కారణంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా వ్యాపారాలకు మంచి అవకాశాలను అందిస్తుందని పర్వీందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.