ఒక భారతీయ మహిళను ఇంట్లోనే భందించి చిత్ర హింసలు పెట్టి, సరైన తిండి పెట్టకుండా వేధించిన శ్రీలంక దంపతులపై ఆస్ట్రేలియాలో కోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.మీరు మనుషులా, పశువులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేకాదు వారి ప్రవర్తన సభ్య సమాజానికి సిగ్గుచేటని, ఆమె పడిన బాధకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తెలిపింది.దంపతులు ఇద్దరిలో పనిమనిషిపై అత్యంత కిరాతకంగా సాటి మహిళ అని చూడకుండా దారుణంగా దాడికి పాల్పడిన భార్యకు కటినమైన శిక్షని విధిస్తూ తీర్పు చెప్పింది…అసలేం జరిగిందంటే.
ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న శ్రీలంక కు చెందిన కుముతి కన్నన్ (53) కందస్వామి కన్నన్ (57) లు తమ ఇంట్లో పనులు చేసేందుకు తమిళనాడుకు చెందిన మహిళను ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ లో తమ నివాసానికి తీసుకువచ్చారు.వచ్చిన రోజు మొదలు ఆమెతో వెట్టి చాకిరీ చేయించడం మొదలు పెట్టారు.
పదే పదే ఇళ్ళు కడిగించడం, తుడవమని చెప్పడం, పిల్లలను చూసుకునే విషయంలో నరకం చూపించే వారు.ఇలా 2007 నుంచీ 2015 వరకూ ఇంట్లోనే ఉంచి బలవంతంగా వెట్టి చాకిరీ చేయించారు.
పలు మార్లు ఆమెపై దాడి చేసినట్టుగా కూడా విచారణలో తేలింది.
ఈ క్రమంలో ఆమె ఎన్నో సార్లు స్పృహ తప్పిపోగా ఇంట్లోనే వైద్యం చేశారని కానీ చివరి సారిగా హాస్పటల్ కు తీసుకువెళ్ళగా ఆమెను వారు హింసిస్తున్నట్టుగా తేలిందని, ఆ సమయంలో ఆమె కేవలం 40 కేజీల బరువు మాత్రమే ఉందని, షుగర్ వ్యాధితో పాటు, శరీరంపై పలు గాయాలు అయ్యాయని పోలీసులు కోర్టుకు ఆధారాలతో సహా తెలియజేశారు.ఆమె పనిచేసిన సమయంలో కేవలం 3.36 డాలర్లు మాత్రమే ఇచ్చేవారని, తట్టుకోలేని విధంగా కొట్టేవారని విచారణ సమయంలో తేలడంతో భార్యా భర్తలు ఇద్దరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విక్టోరియా సుప్రీంకోర్టు జస్టిస్ జాన్ చాంపియన్ భార్య కుముతికి 8 ఏళ్ళ జైలు జీవితం, భర్త కందస్వామి కి 6 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ భాదితురాలికి కొంత డబ్బు ఇవ్వాల్సిందిగా తీర్పు చెప్పారు.
.