కోవిడ్ కట్టడికి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ అత్యవసర వినియోగపు అనుమతుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.కానీ, ఎప్పటికప్పుడు అవాంతరాలు ఎదురవుతున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతులు వస్తే ప్రపంచవ్యాప్తంగా కోవాగ్జిన్ వాడటానికి అవకాశం వస్తుంది.ప్రస్తుతం డబ్ల్యూహెచ్వో అమోదించిన వ్యాక్సిన్లు తీసుకున్నవారికి మాత్రమే విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది.
దీంతో, కోవాగ్జిన్ తీసుకున్న భారతీయులు విదేశాలకు ప్రయాణించాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు ఈ నిబంధన తీవ్ర ప్రతిబంధకంగా మారింది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతీయులకు శుభవార్త చెప్పింది.కోవాగ్జిన్ టీకా వేసుకున్న వాళ్లు తమ దేశానికి రావచ్చు అంటూ ఆసీస్ అనుమతి ఇచ్చింది.కోవాగ్జిన్కు ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గ్రీన్సిగ్నల్ రాకున్నా.ఆస్ట్రేలియా మాత్రం తనకు తానుగా నిర్ణయం తీసుకుంది.
దాదాపు 600 రోజుల తర్వాత అన్ని రకాల ఆంక్షలు ఎత్తివేసి మళ్లీ అంతర్జాతీయ ప్రయాణికులు తమ దేశం రావడానికి ఆస్ట్రేలియా అనుమతులు ఇచ్చింది.దీంతో సోమవారం నుంచి ఆ దేశానికి అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడి మళ్లీ మొదలైంది.
ప్రయాణికుల వ్యాక్సినేషన్ స్టాటస్ సంబంధించి కోవాగ్జిన్కు గుర్తింపు ఇస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది.
టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు ఆమోదం పొందన టీకాలు తీసుకున్న ప్రయాణికులకు తమ దేశంలోకి ప్రవేశం కల్పిస్తామని ఆస్ట్రేలియా సర్కార్ ప్రకటించింది.
ఇప్పటికే ఆస్ట్రాజెనికా, మోడెర్నా.మిక్సిడ్ వ్యాక్సిన్లు తీసుకున్నవారికి ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇస్తోంది.
తాజాగా కోవాగ్జిన్, సైనోఫార్మ్లకు అనుమతి లభించిన నేపథ్యంలో ఇకపై ఆస్ట్రేలియాలో 14 రోజుల హోటల్ క్వారెంటైన్ అవసరం ఉండదని అధికారులు వెల్లడించారు.అయితే రెండు డోసులు తీసుకోని వారు మాత్రం క్వారెంటైన్లోనే ఉండాల్సి ఉంటుంది.
కాగా, కోవిషీల్డ్ టీకాకు సంబంధించి భారతీయులపై బ్రిటన్ సర్కార్ నిర్ణయం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కొత్త ట్రావెల్ రూల్స్ ప్రకారం.కోవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న భారతీయులను యూకేలో టీకాలు వేయించుకోని వారిగానే పరిగణించబడతారని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.అంతేకాకుండా దేశంలో అడుగుపెట్టిన భారతీయులు తప్పనిసరిగా 10 రోజుల పాటు క్వారంటైన్లో వుండాలని తేల్చిచెప్పింది.
దీంతో విషయం భారత ప్రభుత్వం వరకు వెళ్లింది.ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది.
ఆ తర్వాత ఇండియా ధీటుగా బదులివ్వడంతో కోవిషీల్డ్ విషయంలో యూకే వెనక్కి తగ్గింది.
ఈ వివాదం రేగుతున్న సమయంలోనే బ్రిటన్లాగా ఘర్షణ వాతావరణం లేకుండా సున్నితంగా కోవిషీల్డ్కు ఆమోదముద్ర వేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.
కోవీషీల్డ్తో పాటు చైనాకు చెందిన సైనోవాక్ టీకాలు ఇస్తున్న రక్షణ పట్ల ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సంతృప్తి వ్యక్తం చేశారు.సైనోవాక్, కోవీషీల్డ్ టీకాలు వేసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులకు తమ దేశంలో ఎలాంటి ఆటంకాలు ఉండవని స్కాట్ మోరిసన్ తెలిపారు.