కార్తీక పౌర్ణమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షము నందు పున్నమి తిథి కలిగిన 15వ రోజు.కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ మాసమంతా పవిత్రమాసం, అందులో ఈ పౌర్ణమి అత్యంత పవిత్రం…ఈ కార్తీక పున్నమి (నవంబర్ 23 శుక్రవారం) రోజున కింద పేర్కొనబడిన 4 పనులు చేస్తే….ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయని నమ్మకం.
రుద్రాభిషేకం:
ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి.ఇందులో భాగంగా… మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లైతే… కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం.అంతే కాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది.
దానం గా ఇవ్వాల్సిన వస్తువులు:
మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది.ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.
నదీ స్నానం:
ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును.ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందు గాని స్నానము చేయవచ్చును.అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను. శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే……స్మిన్ సన్నిధింకురు||
కేదారేశ్వర వ్రతం :
కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము.ఇది కార్తీక పౌర్ణమి వస్తుంది.ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోని శివుడిని ధ్యానిస్తారు.ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం.వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.ఈ వ్రత మహత్యం వలననే పార్వతీదేవి శివుని అర్థశరీరాన్ని పొందినదని పురాణ ప్రతీతి.