తెలంగాణ బీజేపీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయింది.మొన్నటి వరకు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పై పెద్ద యుద్ధం చేసినట్లుగా ఆ పార్టీ నాయకులు వ్యవహరించారు.
సీఎం కేసీఆర్ తో పాటు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలు పదేపదే ప్రస్తావిస్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలను హైలెట్ చేస్తూ తెలంగాణలో బిజెపి బాగానే బలం పుంజుకుంది.ఒకదశలో టిఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థిగా బిజెపి మారిపోయింది.
కొద్ది నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గెలవడం వంటివి ఆ పార్టీకి మరింత ఉత్సాహాన్ని కలిగించింది.ఇక హుజురాబాద్ లో మాజీ మంత్రి, టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న ఈటెల రాజేందర్ ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపి చేరిపోవడం, హుజురాబాద్ లో ఉప ఎన్నికల తంతు త్వరలోనే మొదలు కాబోతున్న నేపథ్యంలో , బీజేపీ నేతలు మరింత అప్రమత్తమయ్యారు. హోరాహోరీగా వార్ మొదలైన సమయంలోనే, కొద్ది రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు, అమిత్ షా మిగతా కేంద్రమంత్రులను కలవడం , వారితో అనేక విషయాలపై చర్చించడం, వారు సానుకూలంగా కేసీఆర్ విషయంలో స్పందించడం వంటి పరిణామాలు తెలంగాణ బిజెపి నాయకులlo తీవ్ర అసంతృప్తిని రాజేశాయి.బీజేపీ టీఆర్ఎస్ రాజకీయ బద్ధ శత్రువులు అన్నట్లుగా తెలంగాణలో పరిస్థితి ఉన్న సమయంలోనే కేంద్ర బీజేపీ నేతలతో కేసీఆర్ సన్నిహితంగా మెలగడంతో టీఆర్ఎస్ బీజేపీలు పొత్తు పెట్టుకోబోతున్నాయి అనే ప్రచారం మొదలైంది.
ఈ పరిణామాలు తెలంగాణ బిజెపి నాయకుల క్రెడిబులిటిని బాగా దెబ్బతీశాయి.ఇవన్నీ రాబోయే రోజుల్లో బిజెపి కి రాజకీయంగా ఇబ్బంది కలిగించే అంశాలు కావడంతో ,తెలంగాణ బిజెపి నాయకులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
అయితే దీనికి విరుగుడుగా ఈనెల 17వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతుండడం తో అక్కడే టిఆర్ఎస్ పైన, ఆ పార్టీ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ పైన అమిత్ షా ద్వారా తీవ్రస్థాయిలో విమర్శలు చేయించాలని, తెలంగాణ ప్రభుత్వ పనితీరు ఏమాత్రం బాలేదు అన్నట్లుగా అమిత్ షా తో చెప్పించడం ద్వారా , టీఆర్ఎస్ కు బీజేపీ కి సంబంధం లేదని, ఆ పార్టీ తమకు ఎప్పుడూ బద్ధశత్రువు అనే విషయాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లాలని , తద్వారా టిఆర్ఎస్ పై పైచేయి సాధించాలనే పట్టుదలతో తెలంగాణ బిజెపి నాయకులు కనిపిస్తున్నారు.ఈ విషయంలో అమిత్ షా రియాక్షన్ బట్టి తెలంగాణ బిజెపి నాయకుల రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉండబోతోంది.