ఏపీలో కాపు సామాజిక వర్గం లో కదలిక వచ్చింది.ప్రస్తుత పరిస్థితుల్లో కాపు సామాజికవర్గం అండ దండలు ప్రతి పార్టీకి అవసరం కావడం, 2019 ఎన్నికల్లో కీలకంగా మారబోతుండడం, ఏపీ లో చోటుచేసుకున్న పరిణామాలు ఇలా ఆ సామాజిక వర్గం ఓట్లు కోసం ప్రతి పార్టీ లెక్కలు వేసుకుంటోంది.
ఆ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోవడం ద్వారా, రాబోయే ఎన్నికల్లో సునాయాసంగా గెలవవచ్చు అనే లెక్కల్లో ఉన్నాయి.ఏపీలో ప్రధాన పార్టీల గెలుపోటములను శాసించే స్థాయిలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఉండడంతో, ఆ సామాజిక వర్గానికి ఇప్పుడు ఎక్కడ లేని ప్రాధాన్యం పెరిగింది.
అయితే పార్టీలకతీతంగా తాజాగా కాపు నాయకులు అంతా ఒక ప్రత్యేక కూటమి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.
ఇటీవలే హైదరాబాద్ లో కాపు సామాజిక వర్గం నాయకులంతా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి వివిధ పార్టీల లోని కీలకమైన నాయకులతో పాటు, ఆ సామాజిక వర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.సి.బి.ఐ జాయింట్ డైరెక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న లక్ష్మీనారాయణ తో పాటు, విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇలా చాలా మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొనడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి.ఇక ఈ సామాజిక వర్గంలో కీలక నాయకుడిగా, కాపు ఉద్యమనేత గా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం తమతో కలిసి వస్తారని ఆశించినా , ముద్రగడ మాత్రం బీసీ, ఎస్సి లతో కలిపి ప్రత్యేకంగా ఒక కూటమి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.
కాపులు, బీసీలు, ఎస్సీలు కలిస్తే మంచి రాజకీయ ప్రత్యామ్నాయం ఏపీలో ఏర్పడుతుందని, రాబోయే రోజుల్లో తాము కీలకంగా మారే అవకాశం ఉంటుందని ముద్రగడ అంచనా వేస్తున్నారు.కానీ ఆయన ప్రత్యేకంగా కాపుల కోసం ఏర్పాటు చేసే కూటమి వైపు వెళ్లేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరు.కానీ ఆయనకు ఆ సామాజిక వర్గం లో ఉన్న పేరు ప్రఖ్యాతలు అంతా ఇంతా కాదు.
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని టీడీపీ ప్రభుత్వంలో ఆయన చేసిన పోరాటం .ఆ సమయం ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, నీతి నిజాయితీ , కాపులకు ఏదో చేయాలనే ఆయన తాపత్రయం ఇవన్నీ ఆ సామాజిక వర్గం లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.అందుకే ముద్రగడ ను సైతం కలుపుకుని వెళ్తేనే కాపుల ప్రత్యేక కూటమి కి ఒక మంచి గుర్తింపు వస్తుందని గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని కాపు కీలక నాయకులంతా అభిప్రాయపడుతున్నారు.ఏదో రకంగా ముద్రగడ ను తనవైపుకు తీసుకురావాలని ఆరాటపడుతున్నారు.
ఈ మేరకు నిన్న జూమ్ సమావేశంలో కాపు కీలక నాయకులంతా సమావేశమయ్యారు .ప్రత్యక్షంగా మరోసారి విజయవాడలో ముఖా ముఖి సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు.