జిల్లాలోని జనసేన పార్టీ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.ఇన్నర్ రింగ్ రోడ్డులోని కార్యాలయంపై బీరు సీసాలు విసరడంతో పార్టీ కార్యాలయ అద్దాలు ధ్వంసం అయ్యాయి.
అంతటితో ఆగకుండా అడ్డువచ్చిన సెక్యురిటి సిబ్బందిపైకి కూడా రాళ్లు విసిరారు.రాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో ఎవరు దాడి చేసారో తెలియట్లేదు.
అయితే సీసీ కెమెరా విజువల్స్ కోసం పార్టీ నేతలు వెతుకుతున్నారు.జనసేన కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ప్రస్తుతం రాజకీయంగా జనసేన స్పీడ్ పెంచడం … కమిటీలు ఏర్పాటు చేస్తూ… హడావుడి చేస్తుండడంతో కొన్ని ప్రధాన పార్టీలకు ఈ వ్యవహారం మింగుడుపడడం లేదని జనసేన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
రాజకీయంగా తమకు ఎదురులేకుండా చేసుకుని జనసేన ను భయబ్రాంతులకు గురిచేయడానికే టీడీపీ , వైసీపీకి చెందిన అల్లరిమూకలు ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని జనసేన అనుమానిస్తోంది.ఈ కార్యాలయాన్ని రెండు వారాల క్రితమే పార్టీ అధినేత పవన్కళ్యాణ్ ప్రారంభించారు.ఇంతలోనే ఈ దుశ్చర్యకు పాల్పడడంతో… ఈ వ్యవహారాన్ని ఆషామాషీగా వదిలెయ్యకూడదని దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి న్యాయం జరిగే వరకు పోరాడాలని జనసేన పార్టీ ఆలోచన చేస్తోంది.
ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సందడి ఊపందుకోవడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఏపీలో తమ తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని స్పీడ్ పెంచాయి.
ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ కూడా తమ ఇంటితో పాటు… పార్టీ కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాడు.ఈ మేరకు ఈ నెల 14 వ తేదీన ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నాడు.ఇక మూడు ప్రధాన పార్టీలు కూడా నువ్వా నేనా అనే రేంజ్ లో తలపడేందుకు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.
ప్రధానంగా టీడీపీ, వైసీపీ ఓటు బ్యాంకుకు జనసేన గండికొట్టే ప్రమాదం ఉందని ఈ రెండు పార్టీలు గత కొంతకాలంగా ఆందోళనగానే ఉన్నాయి.పవన్ కూడా ఏదో ఒక పార్టీతో జతకట్టి ఎన్నకలకు వెళ్తాడని ఇప్పటివరకు అంతా భావించారు.
అయితే పవన్ మాత్రం తాము ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని చెప్పిన నేపథ్యంలో జనసేన ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ….ఇటువంటి సంఘటనలు జరగడం ప్రస్తుతం సంచలనంగా మారింది.