పెరుగుతున్న గన్ కల్చర్ని కట్టడి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అమెరికాలో పిచ్చి ఉన్మాదానికి అమాయకులు బలవుతూనే ఉన్నారు.గంటల వ్యవధిలో రెండు చోట్ల చేసుకున్న కాల్పుల ఘటనల్లో ఏడుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆదివారం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్కు ఉత్తరాన 320 మైళ్ల దూరంలో ఉన్న సౌత్వెస్ట్ ఫ్రెస్నోలోని ఓ ఇంట్లో కొందరు పార్టీ చేసుకుంటున్నారు.ఈ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వారిపై కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మరణించగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
కాల్పుల సమయంలో ఇంట్లో మొత్తం 35 మంది ఉన్నట్లు తెలుస్తోంది.ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
మరో ఘటనలో ఓక్లహోమాలోని డంకన్లోని వాల్మార్ట్ స్టోర్లో సోమవారం తెల్లవారుజామున దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.డంకన్ పోలీస్ చీఫ్ డానీ ఫోర్డ్ మాట్లాడుతూ.స్టోర్ వెలుపల కాల్పులు జరిగాయని.ఇద్దరు కారులో మరణించగా.నిందితుడిగా భావిస్తున్న మూడో వ్యక్తి పార్కింగ్ ప్రదేశంలో చనిపోయి వున్నాడు.
దుండగుడు కారులో ఉన్న ఒక జంటను కాల్చేసి అనంతరం తనను తాను కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.కారు విండ్షీల్డ్లో బుల్లెట్ రంధ్రాలు కనిపించాయి.
ఘటనా స్ధలంలో సెమీ ఆటోమేటిక్ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఓక్లహోమా స్టేట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసును దర్యాప్తు చేస్తుందని స్టీఫెన్స్ కౌంటీ జిల్లా అటార్నీ జనరల్ జాసన్ హిక్స్ వెల్లడించారు.
ఈ ఏడాది ఆగస్టులో టెక్సాస్లోని వాల్మార్ట్ స్టోర్లో జరిగిన కాల్పుల ఘటనలో 22 మంది మరణించిన సంగతి తెలిసిందే.