కోవిడ్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశం అమెరికాయే.లక్షలాది మరణాలు, అంతకు రెట్టింపు సంఖ్యలో కేసులు వీటన్నింటికి మించి ఆర్ధిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగింది.
దీనంతటికి కారణం చైనీయులు, ఆసియన్లే కారణమనే భావన అమెరికన్లలో బలంగా నాటుకుపోయింది.దీంతో ఆసియా అమెరికన్లను టార్గెట్ చేసుకుని విద్వేష దాడులకు పాల్పడుతున్నారు.
గడిచిన కొద్ది వారాల నుంచి ఈ తరహా ఘటనలు ఎక్కువవుతున్నాయి.భౌతికదాడులతో పాటు హత్యలకు సైతం ఉన్మాదులు వెనుకాడటం లేదు.
గత మంగళవారం మూడు మసాజ్ పార్లర్లలో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించారు.వీరిలో ఆరుగురు ఆసియన్లే, అందులోనూ మహిళలు కావడం గమనార్హం.మృతుల్లో నలుగురు దక్షిణ కొరియా మహిళలు వున్నారు.జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటాలోని రెండు పార్లర్లలో, ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వుడ్స్టాక్లోని మరో పార్లర్లో మంగళవారం సాయంత్రం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.
కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్న 21 ఏళ్ల రాబర్ట్ ఆరోన్ లాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ కాల్పుల ఘటనను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, పాప్ సింగర్ రిహానా సహా అమెరికాలోని భారతీయ సమాజం తీవ్రంగా ఖండించింది.
అటు అమెరికన్లలో మార్పు తీసుకొచ్చేందుకు గాను అధ్యక్షుడు జో బైడెన్, కమలా హారీస్ సైతం రంగంలోకి దిగారు.జాత్యహంకార ఘటనలకు విరుద్ధంగా అమెరికన్లు గళం విప్పాలని అధ్యక్షుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ తరహా ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నప్పటికీ.మనమంతా మౌనంగా ఉంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాడాలని బైడెన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ నేపథ్యంలో ఆసియా- అమెరికన్లకు మద్ధతుగా స్థానిక అమెరికన్లు గళమెత్తారు.
శనివారం అట్లాంటాలోని జార్జియా స్టేట్ క్యాపిటల్ వెలుపల వేలాది మంది ర్యాలీ నిర్వహించారు.ఈ నిరసనలో పాల్గొన్న అన్ని వర్గాల వారు అమెరికన్ జెండాలను చేతపట్టుకుని ‘‘ తాము వైరస్ కాదు’’ , ‘‘ ఆసియన్లపై విద్వేషం వద్దు’’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు.
యూఎస్ సెనేటర్లు రాఫెల్ వార్నాక్, జోన్ ఒసాఫ్, జార్జియా రాష్ట్ర ప్రతినిధి బీన్గుయెన్ తదితర ప్రముఖులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు.తామంతా ఆసియా సోదరసోదరీమణులకు అండగా ఉంటామని వార్నాక్ తెలిపారు.