ఏపీలో జనసేన తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాయని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.దీనికి తగ్గట్టుగానే రెండు పార్టీల వ్యవహారం ఉండడం, అనేక విషయాల్లో ఒకరికొకరు పరోక్షంగా మద్దతు ఇచ్చుకోవడం, కొద్ది నెలల క్రితం ఏపీ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా పోటీ చేయడం , ఒకరికొకరు సహకరించుకోవడం ఇవన్నీ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయి అనే సంకేతాలను ఇచ్చాయి.
ఈ క్రమంలోనే పవన్ బీజేపీతో పొత్తు రద్దు చేసుకుని తెలుగుదేశం కు మద్దతు ఇస్తారనే ప్రచారం జరిగింది .
కానీ పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో బిజెపికి ఎటువంటి ఇబ్బంది లేకుండా , కేవలం వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ఉండడం తో, బిజెపితో పొత్తు రద్దు చేసు కునేందుకు జనసేన సిద్ధంగా లేదు అనే విషయం అర్థమైపోయింది.అదే సమయంలో టిడిపిని కూడా దగ్గర చేసుకుని మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా అర్థం అవుతోంది.ఇదిలా ఉంటే పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలిపి అనేక డిమాండ్లు వినిపించిన నేపథ్యంలో , పవన్ డిమాండ్లకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలికింది.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లాలని పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతించింది.
తాము గతంలో ఇదే డిమాండ్ చేసినట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ప్రజలు పోరాటాలకు సిద్ధం గా ఉండాలి అంటూ అచ్చెన్న నాయుడు పిలుపునిచ్చారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు లోక్ సభ లో ముగ్గురు ఎంపీ లు బల్ల గుద్ది మరీ మాట్లాడారు అంటూ అచ్చెన్న గుర్తు చేశారు.