ఏపీలో రాజకీయాలు ఓ రేంజ్లో వేడెక్కుతున్నాయి.ఈ టైంలో మరోసారి ఉప ఎన్నికలతో ఏపీ రాజకీయం ఆసక్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో త్వరలోనే రెండు లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మృతి చెందారు.
దీంతో తిరుపతి ఎంపీ సీటుకు ఆరు నెలల్లోనే ఉప ఎన్నిక జరగనుంది.తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ సీటుతో పాటు బిహార్ ఎన్నికలతో కలిసి తిరుపతి ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఇక గత ఎన్నికల్లో ఇక్కడ దుర్గా ప్రసాద్ 2.28 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు.పైగా ఈ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ బలంగా ఉండడంతో ఇక్కడ వైసీపీ గెలుపు విషయంలో జగన్కు వచ్చిన ఇబ్బంది లేదు.
ఇక రెండో సీటు విషయంలో మాత్రం ఏపీ రాజకీయం వేడెక్కేలా ఉంది. నరసాపురం నుంచి పార్టీ ఎంపీగా ఉన్న కనుమూరు రఘురామ కృష్ణంరాజు పార్టీపై ఫైర్ అవుతున్నారు.
ఇప్పటికే ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా వైసీపీ ఎంపీలు లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు.
ఇక రఘురామకు వైసీపీ నేతలు ఇప్పటికే రాజీనామా సవాళ్లు రువ్వుతున్నారు.రఘురామ సైతం తన గెలుపును రాజధాని అమరావతికి రెఫరెండంగా భావిస్తే తాను రాజీనామా చేసి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానంటూ ఆయన ప్రతి సవాల్ చేస్తున్నారు.ఆయన పార్టీ మారితే బీజేపీయే ఆప్షన్గా ఉంది.
ఆయన కొద్ది రోజులుగా బీజేపీకి దగ్గరవుతున్నారు.రఘురామ బీజేపీ నుంచి ఉప ఎన్నికల బరిలో ఉంటే ఆయనకు జనసేన మద్దతు ఉంటుంది.గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసిన నాగబాబుకు 2.50 లక్షల ఓట్లు వచ్చాయి.
ఇక రఘురామ అమరావతి స్టాండ్తో పోటీ చేస్తే ఆయనకు టీడీపీ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది.పైగా బాబుకు ఆయన పాత మిత్రుడే.ఎలాగైనా వైసీపీని ఓడించాలని ఈ పార్టీలన్ని కలిస్తే అప్పుడు నరసాపురం ఉప ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ తప్పదు.ఈ క్రమంలోనే తిరుపతి సీటు గెలుపు విషయంలో వైసీపీకి వచ్చిన ఇబ్బంది లేకపోయినా నరసాపురంలో మాత్రం ఇబ్బంది తప్పేలా లేదు.