సాధారణంగా 30 ఏళ్లు దాటగానే చాలా మంది వ్యాయామాన్ని అంతగా పట్టించుకోరు.ఇక 40 ఏళ్లు రాగానే పరుగులు పెట్టడం మానేస్తారు.
రోజూ వాకింగ్ చేసే అలవాటు కూడా చాలా కొద్ది మందికే ఉంటుంది.ఇక 60 ఏళ్లు వస్తే కృష్ణా రామా అంటూ ఆధ్యాత్మిక సేవలోనో, లేక సీరియల్స్ చూస్తూనో గడిపేస్తుంటారు.
అయితే అలాంటి వారికి భిన్నంగా 105 ఏళ్ల వయసులో ఓ బామ్మ పరుగుల రాణిగా మారింది.వయసులో ఉన్నవారు కూడా ఆశ్చర్యపోయేలా పరుగు పందేలలో విజేతగా నిలుస్తోంది.
ఆ బామ్మ గురించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
గుజరాత్లోని వడోదరలో ఆదివారం జరిగిన నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల రేసును కేవలం 45.40 సెకన్లలో 105 ఏళ్ల రాంబాయి అనే వృద్ధురాలు పూర్తి చేసింది.ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అనే సామెతను నిరూపించింది.
అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈవెంట్లో 100 మీటర్లు, 200 మీటర్ల విభాగాల్లో పరుగు పందెంలో ఆమె పాల్గొంది.రెండు రేసుల్లోనూ బంగారు పతకాలను కైవసం చేసుకుని అందరినీ అవాక్కయ్యేలా చేసింది.100 మీటర్లు రేసును 45.40 సెకన్లలో పూర్తి చేసిన రాంబాయి ఈ విభాగంలో సరికొత్త రికార్డు సృష్టించింది.200ల మీటర్ల రేసును కేవలం 1 నిమిషం 52.17 సెకన్లలో పూర్తి చేసింది.ప్రపంచ మాస్టర్స్ మీట్లో 74 సెకన్లలో 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచి ఖ్యాతి గడించిన 101 ఏళ్ల మన్ కౌర్ రికార్డును బద్దలు కొట్టింది.
హర్యానాలోని చర్కీ దాద్రీ జిల్లాకు చెందిన రాంబాయి 104 సంవత్సరాలోనే తన పరుగు ప్రారంభించింది.2021 నంబర్లో వారణాసిలో తొలి సారి పరుగు పందెంలో పాల్గొంది.రాంబాయి రోజువారీ ఆహారంలో 1 లీటర్ పాలు, చుర్మా, బజ్రా రోటీ, 250 గ్రాముల నెయ్యి, 500 గ్రాముల పెరుగు తీసుకుంటుంది.
గతేడాది పరుగు పందేలలో పాల్గొనడం ప్రారంభించిన ఆమె కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన ఈవెంట్లలో కూడా పాల్గొంది.డజను పతకాలను అందుకుని వాటిని అందరికీ ఎంతో గర్వంగా చూపుతోంది.