గత నెల రోజులుగా రాజస్థాన్ రాజకీయాల్లో చోటుచేసుకున్న సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది.రాజస్థాన్ రాజకీయాల్లో సంక్షోభం నెలకొల్పి అక్కడ పాగా వేయాలి అని చూసిన బీజేపీ కి ఎదురుదెబ్బ తగిలింది.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ కు డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ లకు మధ్య విభేదాలు రావడం తో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే.అయితే దీనిని అనుకూలంగా మార్చుకొని అక్కడ పాగా వేయాలి అని పావులు కదిపిన ప్రతిపక్ష పార్టీ బీజేపీ కి అవకాశం ఇవ్వకుండా సీఎం గెహ్లాట్ తెలివిగా వ్యవహరించి తన పదవిని నిలబెట్టుకున్నారు.
బీజేపీ అవిశ్వాసం పెట్టాలనుకున్న సమయం లో వారికి అవకాశం ఇవ్వకుండా ముందుగా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఈ పరీక్షలో మూజువాణి పద్దతిలో గెహ్లాట్ విజయం సాధించారు.నెల రోజుల సంక్షోభం తరువాత ఈ రోజు రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా,తొలిరోజే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి గెహ్లాట్ మూజువాణి ఓటు తో ఈ సంక్షోభానికి ముగింపు పలికారు.
సభలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా అధికార కాంగ్రెస్ పార్టీ తామే విశ్వాస పరీక్షకు వెళ్తామని ప్రకటించింది.స్వయంగా ముఖ్యమంత్రే సభలో విశ్వాస పరీక్షకు తీర్మానాన్ని ప్రవేశపెడితే ఇక ఇతర సభ్యులు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానాలను పరిగణనలోకి తీసుకోరు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ వ్యూహం రాజస్థాన్ రాజకీయాల్లో పారలేదు.చివరికి మూజువాణి ఓటుతో గెహ్లాట్ విజయం సాధించడం తో అక్కడ నెలకొన్న సంక్షోభానికి తెరపడినట్లు అయ్యింది.
కరోనా టైం లోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడడం తో బీజేపీ అక్కడ అధికార పీఠం చేజిక్కించుకున్న విషయం విదితమే.అయితే రాజస్థాన్ రాజకీయాల్లో కూడా ఏర్పడిన సంక్షోభాన్ని పావులా వాడుకోవాలి అని భావించిన బీజేపీ కి చుక్కెదురైంది.
రాజస్థాన్ సీఎం,డిప్యూటీ సీఎం ల మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక,రాహుల్ గాంధీ లు రంగంలోకి దిగి వారి మధ్య సయోధ్య కుదర్చడం తో ఈ సంక్షోభానికి తెరపడింది.