ప్రస్తుతం టిడిపి లో ఉన్న నాయకులు చాలామంది యాక్టివ్ గా ఉండడమే లేదు.మరి కొంతమంది యాక్టివ్ గా ఉన్నా, వైసిపి ప్రభుత్వం వేధింపులకు గురవుతున్నారు.
గతంలో నమోదైన వివిధ కేసులతో పాటు, వారి అవినీతి వ్యవహారాలకు సంబంధించి అన్ని విషయాలను వైసిపి వెలికి తీస్తూ, విచారణలు చేయిస్తూ, అరెస్టులు సైతం చేస్తుండడంతో టిడిపి నాయకుల్లో ఎక్కడలేని ఆందోళన నెలకొంది.ఇప్పటికే ఎంతో మంది మాజీ మంత్రులు, కీలక నాయకులు అరెస్ట్ అయ్యారు.
మరికొంత మంది వైసీపీలోకి, ఇంకొంతమంది బీజేపీ వైపు వెళ్లాల్సి వచ్చింది.అదే విధంగా కేంద్ర మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగానూ, పార్టీ సీనియర్ గాను, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలక నేతగా అశోక్గజపతిరాజు ఉన్నారు.
గత కొంత కాలంగా ఆయన కుటుంబానికి చెందిన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది.
మాన్సాస్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు ను తొలగించి ఆ పదవిలో అశోక్ గజపతిరాజు అన్న కూతురు సంచయిత ను కూర్చోబెట్టడం చాలా వివాదమే రేపింది.సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత మళ్లీ మాన్సాస్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు కోర్టు తీర్పుతో నియమితులు అయ్యారు.
అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వంటి వారు పూర్తిగా అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేసుకుంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉండడం , వైసిపి వేధింపులతో అశోక్ గజపతిరాజు తీవ్రంగా విసిగిపోయారు.
అయితే ఈ విషయంలో టిడిపి నుంచి అనుకున్న స్థాయిలో మద్దతు లభించకపోవడం, తాను ఒంటరిగానే ఈ వ్యవహారాలను ఎదుర్కోవాల్సి రావడం, రానున్న రోజుల్లోనూ వైసిపి కి సంబంధించిన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉండడం, ఇలా ఎన్నో కారణాలతో బీజేపీ వైపు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.అయితే తాను ప్రాణం ఉన్నంతవరకు టీడీపీలోనే ఉంటానని అశోక్ చెప్పినా, ఇప్పుడు ఆయన బిజెపిలో చేరబోతున్నారనే వార్తలపై మాత్రం ఆయన స్పందించేందుకు ఇష్టపడడం లేదు.ఇప్పటికే విశాఖకు చెందిన బిజెపి నాయకుడు ఒకరు అశోక్ గజపతిరాజు ను బిజెపిలో చేరేలా ఒప్పించినట్లు తెలుస్తోంది.
టీడీపీ- బీజేపీ పొత్తు కొనసాగిన సమయంలో అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు.ఆ సమయంలో టీడీపీ బీజేపీ పొత్తు పై అశోక్ గజపతిరాజు చంద్రబాబుతో విభేదించినట్లు తెలుస్తోంది.పార్టీ అధినేత ఆదేశాలతో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన అశోక్ ఇప్పుడు మళ్లీ బీజేపీ వైపు చూస్తూ ఉండడం టిడిపి వర్గాల్లో కలవరం పుట్టిస్తోంది.