గత కొద్దీ రోజులుగా నిర్భయ దోషుల ఉరిశిక్ష పై ఉత్కంఠత నెలకొంటున్న సంగతి తెలిసిందే.సరిగ్గా వారికి ఉరిశిక్ష అమలు కావాల్సిన సమయంలో స్టే విధిస్తూ పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీనితో ఈ విషయం పై కేంద్రం,ఢిల్లీ సర్కార్ ఢిల్లీ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసింది.కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై శని, ఆదివారాల్లో విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.దీనితో ఈ రోజు తుది తీర్పు వెల్లడించనుండడం తో మరోసారి ఉత్కంఠ నెలకొంది.2012లో ఢిల్లీలోని నిర్భయపై ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్కుమార్ సింగ్ (31) అత్యంత దారుణంగా సామూహికంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆమె మరణానికి కూడా కారకులయ్యారు.అలాంటి వారికి 7 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ శిక్షలు మాత్రం అమలు కాకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది.అయితే ఇటీవల ఆ నలుగురు దోషులకు ఉరిశిక్షలు అమలు జరపాలి అంటూ ఢిల్లీ పాటియాలా కోర్టు తీర్పు వెల్లడించింది.
అయితే సరిగ్గా వారికి ఉరిశిక్ష అమలు కావడానికి ఒక్కరోజు ముందు వారి ఉరిశిక్ష పై స్టే విధిస్తూ అదే పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేయడం తో నిర్భయ దోషులు ఉరి నుంచి తప్పించుకున్నారు.అయితే వాస్తవానికి ఈ కేసులో… నలుగురు దోషులకూ ఒకేసారి ఉరిశిక్ష వెయ్యాలనే రూల్ ఉంది.
ఈ రూల్ని అడ్డం పెట్టుకొని దోషులు ఒకరి తర్వాత ఒకరుగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంటున్నారు.ఫలితంగా ఫిబ్రవరి 1న అమలు కావాల్సిన ఉరిశిక్ష అమలవ్వలేదు.
దీంతో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కారు రెండూ ఈ స్టేను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించాయి.అయితే ఈ పిటీషన్ లపై విచారణ జరిపిన హైకోర్టు తుది తీర్పును రిజర్వ్ లో పెట్టి ఈ రోజు తుది తీర్పు వెల్లడించనుంది.ఇవాళ ఢిల్లీ హైకోర్టు గనక నలుగురిలో ఇద్దరికి ముందుగా ఉరిశిక్ష వెయ్యాలని సూచిస్తే… రెండ్రోజుల్లో వారికి ఉరిశిక్ష వేసే అవకాశాలుంటాయి.లేదంటే నలుగురికీ ఒకేసారి శిక్ష అమలు చేసేందుకు ప్రక్రియ చేపట్టమని కూడా సూచించే అవకాశాలున్నాయి.