పక్కవారు ఎలా పోతే నాకేంటి అనే ఈ రోజుల్లో ఒక మహిళ కరోనా సమయంలో కూడా తన ప్రాణాలకు తెగించి మరి తన ఉద్యోగ బాధ్యతలను యధావిధిగా నిర్వర్తించి ఫోర్బ్స్ ఇండియా డబ్ల్యు పవర్ 2021 జాబితాలో చోటు దక్కించుకుంది.ఆశా వర్కర్ గా పని చేస్తూ గిరిజనుల బాగోగులు చూసుకుంటూ అందరికి ఆదర్శంగా నిలిచింది.
ఒడిశా రాష్ట్రానికి చెందిన మతిల్దా అనే మహిళ గిరిజనులు ఎక్కువగా ఉండే సుందర్ గఢ్ జిల్లాలోని గర్ గండ్ బహల్ గ్రామంలో గత 15 సంవత్సరాలుగా ఆశా వర్కర్ గా పని చెస్తుంది.అయితే ఈ గ్రామంలో దాదాపు వేయి మంది దాక జనాభా నివసిస్తూ ఉంటారు.
అందరి బాగోగులు ఈమె చూస్తుంటారు.
ఆశా కార్యకర్తగా సైకిల్ పై ఊరంతా తిరుగుతూ ప్రజల బాగోగులు చూసుకుంటూ వ్యాక్సిన్లు వేయించడం, బాలింతలకు పౌష్టికాహారం అందించడం, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.
ఉదయం 5 గంటలకే నిద్ర లేచి తన ఇంటి పనులు పూర్తి చేసుకుని, కుటుంబసభ్యులకు ఆహారం సిద్ధం చేసి, ఆశా వర్కర్ గా విధుల్లో తిరుగుతూ ఉంటుంది.గిరిజనులలో ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించి ఎటువంటి అనారోగ్యం కలిగినా వైద్యుల వద్దకే వెళ్ళాలి అని సొంత వైద్యాలు చేయకూడదు అని అందరిలో అవగాహనా కల్పించింది.
కాగా ఆశా వర్కర్ గా పని చేస్తున్న మతిల్దా జీతం 4,500 రూపాయిలు మాత్రమే.ఎవరయినా అనారోగ్యం పాలయితే వారికి మందులు ఇవ్వడం దగ్గర నుండి, గర్భిణీలకు పురుడు పోసి బిడ్డను ప్రసవించే దాక వారికి తోడుగా ఉంటుంది.
కరోనా మహమ్మారి సమయంలో కూడా ఇంట్లో ఉండకుండా ఫ్రంట్ లైన్ వర్కర్ గా పని చేసి ఎన్నో ప్రాణాలు కాపాడారు.ఈమె కరోనా బారిన పడి కోలుకున్న తరువాత కూడా ఇంట్లో కూర్చోకుండా మరలా పనిలో పడిపోయింది.ఈమె గురించి తెలుసుకున్న ఫోర్బ్స్ ఈమెకు ఫోర్బ్స్ ఇండియా డబ్ల్యు పవర్ 2021 జాబితాలో చోటు ఇచ్చింది.తాను ఆశా వర్కర్ గా పని చేస్తున్నందుకు గర్వపడుతున్నట్లు మతిల్దా తెలిపారు.
ఈ క్రమంలో మతిల్దాకు స్వశక్తిమంతులైన మహిళల జాబితాలో చోటు దక్కడంపై ఒడిశా రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ సంతోషం తెలిపారు.