కెనడాలోని మూడు కాలేజీలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మూసివేయడంతో దాదాపు 2000 మంది భారతీయ విద్యార్ధులు రోడ్డునపడ్డ సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో విద్యార్ధులకు న్యాయం చేసేందుకు కెనడాలోని భారత హైకమీషన్ రంగంలోకి దిగింది.
దీనికి సంబంధించి శనివారం ఒక అడ్వైజరీని జారీ చేసింది.రైజింగ్ ఫీనిక్స్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న మూడు సంస్థలలో చేరిన భారతీయ విద్యార్ధులు.
ఆకస్మిక మూసివేత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో వారంతా తమను సంప్రదించినట్లు హైకమీషన్ కార్యాలయం తెలిపింది.
బాధిత విద్యార్ధులకు సహాయం అందించడంతో పాటు సమస్యను పరిష్కరించేందుకు గాను కెనడా ఫెడరల్ ప్రభుత్వం, క్యూబెక్ ప్రావిన్స్, ఇండో కెనడియన్ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.బాధిత విద్యార్ధులు వారు నమోదు చేసుకున్న సంస్థలను నేరుగా సంప్రదించాలని క్యూబెక్ ప్రభుత్వం సూచించింది.
అలాగే విద్యార్ధులు తమ ఫీజు రీయింబర్స్మెంట్లో లేదా ఫీజు బదిలీలో ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొన్నట్లయితే .క్యూబెక్ ప్రావిన్స్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయాలని ఇండియన్ హైకమీషన్ తెలిపింది.
మరోవైపు కెనడాలో ఇప్పటికే ఎన్రోల్ చేయబడిన విద్యార్ధులకు ప్రత్యామ్నాయ సంస్థల్లో అడ్మిషన్ పొందేందుకు అధికారులు గ్రేస్ పీరియడ్ను అందజేస్తున్నారు.ఇకపై కెనడాలో ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసుకునే ముందు విద్యాసంస్థల చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని హైకమీషన్ భారతీయ విద్యార్ధులను హెచ్చరించింది.
అలాగే సదరు విద్యాసంస్థ కెనడా ఫెడరల్ ప్రభుత్వంతో పాటు ప్రావిన్స్ల చేత గుర్తించబడిందో లేదో నిర్ధారించుకోవాలని సూచించింది.
కాగా.కెనడాలోని మాంట్రియల్లో వున్న Collège de comptabilité et de secretariat du Québec (CCSQ), College de I’Estrie (CDE), M కాలేజ్లు కోవిడ్ కారణంగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.దీంతో క్రెడిట్ ప్రోటెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి.
ఈ క్రమంలోనే జనవరి 10న ఆకస్మాత్తుగా కాలేజీలు మూతపడ్డాయి.CCSQ కాలేజీ.
అకౌంటింగ్, సెక్రటేరియల్ స్టడీస్, మెడికల్, కంప్యూటింగ్, లీగల్ స్టడీస్లో వృత్తిపరమైన శిక్షణను అందిస్తోంది.CDE కాలేజీ.
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కోర్సులను అందిస్తోంది.M కాలేజీలో వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికతలో నాలుగు కోర్సులు అందజేస్తోంది.1,173 మంది భారత విద్యార్ధులు కెనడాలో వ్యక్తిగతంగా చదువుతుండగా.637 మంది విద్యార్ధులు కోవిడ్ కారణంగా భారత్లో ఇంటి నుంచి ఆన్లైన్ తరగతుల ద్వారా చదువుతున్నారు.