15 ఏళ్ల క్రితం అనుష్క కెరియర్ ఆరంభంలో వచ్చిన అరుందతీ సినిమా ఆమెకి ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో అందరికి తెలిసిందే.ఒక్కసారిగా టాలీవుడ్ లో అనుష్కకి ఆ సినిమా స్టార్ హీరోయిన్ ఇమేజ్ తీసుకొచ్చింది.
అంత వరకు హీరోలతో రొమాన్స్ కి పరిమితం అయిన అనుష్క తరువాత కాస్తా ప్రాధాన్యత ఉన్న పాత్రలలో కనిపిస్తూ వచ్చింది.దర్శకులు కూడా అనుష్కని కేవలం గ్లామర్ క్వీన్ గానే చూడకుండా ఆమె నటనకి ఫిదా అయిపోయి గౌరవం ఇస్తూ స్టార్ హీరోల సినిమాలకి ఎంపిక చేస్తూ ఉండేవారు.
అరుందతీ సినిమాలో ఓ విధంగా చెప్పాలంటే అనుష్క విశ్వరూపం చూపించింది.ఆ సినిమాలో సంభాషణలు ఇప్పటికి జనాల నోట్లో నానుతూ ఉంటాయి.
అలాగే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఈ సినిమా భారీ హిట్ అందించడంతో భారీగా ఆదాయం తెచ్చి పెట్టింది.ఈ సినిమాతో మళ్ళీ కోలుకున్న నిర్మాత తరువాత టెలివిజన్ కి పరిమితం అయ్యి అక్కడ రియాలిటీషోలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
అయితే కోడి రామకృష్ణ, శ్యామ్ ప్రసాద్ రెడ్డి మళ్ళీ అరుందతీ సీక్వెల్ కోసం కొన్నేళ్ళ క్రితం ప్లాన్ చేశారు.
ఎందుకనో అది వర్క్ అవుట్ కాలేదు.
తరువాత కోడి రామకృష్ణ చనిపోయారు.నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా ఆ సినిమా సీక్వెల్ ఆలోచన పక్కన పెట్టేశారు.
అయితే ఇప్పుడు ఓ ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నుంచి అరుందతీ సీక్వెల్ కోసం పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.సీక్వెల్ ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయాలని భావిస్తున్నట్లు బోగట్టా.
దానికోసం ఇప్పటికే ఓ ప్రముఖ రచయిత కథ కూడా సిద్ధం చేశాడని, అనుష్కతోనే ఈ సీక్వెల్ చేయాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఒక వేళ అనుష్క కాదంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేతో ప్లాన్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.
మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అధికారికంగా బయటకొచ్చే వరకు వేచి చూడాలి.